ఓ వైపు యావత్ భారతం కరోనా మహమ్మారితో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. మరికొన్ని చోట్ల వరదలకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే.. గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఆందోళన కల్గిస్తున్నాయి. దాదాపు రెండు మూడు నెలలుగా మహారాష్ట్ర, త్రిపుర, జమ్ముకశ్మీర్,నాగాలాండ్, మణిపూర్తో పాటు పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
తాజాగా శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని ముంబై నగరంలో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.33 గంటలకు ముంబాయి సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 2.8గా నమోదైంది. నార్త్ ముంబైకి 91కిలో మీటర్ల దూరంలో 10కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గతంలో కూడా పాల్ఘర్ సమీపంలో స్వల్ప భూకంపాలు పలుమార్లు సంభవించాయి.