దీపావళి వస్తుందంటే చాలు.. గత కొన్నేళ్లుగా పటాకుల విషయంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. కొందరు పర్యావరణం కాలుష్యమవుతుందంటూ గగ్గోళ్లు పెడుతూ కోర్టు మెట్లు ఎక్కి దీపావళికి కాల్చే బాంబులతోనే కాలుష్యం వస్తుందన్నట్లు వాదిస్తూ..
హిందూ పండుగలపై విషం గక్కుతున్నారంటూ పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఇతర సందర్భాల్లో ఇవే పటాకులు కాలుస్తుంటే.. అప్పుడు మాత్రం వారంతా మౌనంగా ఉంటారన్నారు. అయితే ఈ సారి సుప్రీం కోర్టు ఈ పటాకుల వాడకంపై స్పష్టతనిచ్చింది. పటాకులపై నిషేధం లేదని.. అయితే కేవలం గ్రీన్ కాకర్స్ మాత్రమే కాల్చలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిషేధిత పటాకులను వాడకూడదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో పర్యావరణానికి హానీ కలిగించని పటాకుల వైపు ప్రజలంతా చూస్తున్నారు.
ఈ క్రమంలో 400 ఏళ్ల క్రితం మట్టితో పటాకులను తయారు చేసే విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇందుకు గుజరాత్ రాష్ట్రం వేదికగా మారింది. వడోదర జిల్లాలోని ఫతేపూర్ కుమ్హర్వాడ ప్రాంతంలో మట్టితో తయారు చేసే కోతీస్ పటాకులను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో కొందరు హస్తకళాకారులు వీటిని గతంలో తయారు చేసేవారు. అయితే మార్కెట్లో చైనా పటాకులు వీటికి బ్రేకులు వేశాయి. దీంతో తయారీదారులు తీవ్రంగా నష్టాలు చవిచూడటంతో పాటు.. ఎవరి నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో తయారు చేయడాన్ని ఆపేశారు. విషయం తెలుసుకున్న ప్రముఖ్ పరివార్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ అధ్యక్షుడు నితల్ గాంధీ ఈ దేశీ బాంబుల తయారీకి మళ్లీ జీవం పోశారు. ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన “వోకల్ ఫర్ లోకల్” స్పూర్తితో తయారీదారులను ప్రోత్సహిస్తూ వీటిని తయారు చేయించారు. దీంతో కోతీస్ తయారు చేసి హస్తకళాకారులు పెద్ద మొత్తంలో ఈ సారి వీటిని తయారు చేశారు. ఇవి పూర్తిగా దేశీవాళీ బాంబులని.. వీటిలో పేపర్, వెదురుతో తయారుచేసే చక్రీ ఉంటుందని తయారీదారులు చెప్పారు. ఈ పటాకులతో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిళ్లదని.. త్వరగా కరిగిపోతాయని.. పిల్లలకు కూడా ఎలాంటి హానీ కలగదని ఎన్జీవో సంస్థ అధ్యక్షులు తెలిపారు. వీటిని ప్రతీఒక్కరు కాల్చవచ్చన్నారు. మా సంస్థ ముఖ్యఉద్దేశం స్థానిక కళాకారులకు దీని ద్వారా ఉపాధి కల్గించడంతో పాటు దేశీవాళీ బాంబుల తయారీని పెంచడమన్నారు.
రామన్ ప్రజాపతి అనే తయారీదారుడు మాట్లాడుతూ.. తాము 20 ఏళ్లక్రితం లాభాలు లేకపోవడంతో వీటి తయారీ ఆపేశానని.. కానీ ఇప్పుడు నితల్ భాయ్ సహకారంతో మళ్లీ తయారు చేస్తున్నామన్నారు. కొన్ని కోతీస్ పటాకులను చూపించడంతో వాటిని తయారు చేయమని చెప్పారని.. దీంతో రెండు ట్రాక్టర్ల మట్టితో దాదాపు లక్షకు పైగా కోతీస్ పటాకులను తయారు చేశామన్నారు. ఈ ఏడాది మేము కొన్ని డబ్బులను సంపాదించుకోగలిగామని.. ఇందుకు కారణం ఎన్జీవో అధ్యక్షుడు నితల్ గాంధీనే అని తయారీదారుడు రామన్ ప్రజాపతి చెప్పుకొచ్చారు.
