సోషల్ మీడియాలో ట్రోలింగ్ హద్దులు మీరుతోంది. నిన్న మొన్నటి వరకు ఓ స్టేజ్లో ఉన్న ట్రోలింగ్.. ఇప్పుడు హద్దులు మీరడమే కాకుండా.. వికృత వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత క్రికెటర్ మాజీ కెప్టన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రథసారధిగా ఉన్న మహేంద్ర సింగ్ ట్రోలింగ్కు గురయ్యాడు. వ్యక్తిగతంగా ధోనీని అంటే ఏదో ఆటగాడిపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయారన్న అసహనంతో అన్నారనుకోవచ్చు. కానీ ఆయన ఐదేళ్ల కూతురిపై దారుణ వ్యాఖ్యలు చేశాడు ఓ దుర్మార్గుడు.
రెండు రోజుల క్రితం ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కోల్కతా టీం చేతిలో ఓటమి పాలయ్యింది. అది కూడా 10 పరుగుల తేడాతో. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్గా ఉన్న
మహేంద్ర సింగ్ ధోనీ కేవలం 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. ధోనీ రానించకపోవడంతోనే మ్యాచ్ చేజారిందని ట్రోల్స్ జరిగాయి. ఈ క్రమంలో ధోనిపై తిట్ల వర్షం కురిసింది. ధోని సోషల్ మీడియా అకౌంట్స్తో పాటు.. ఆయన భార్య సాక్షి అకౌంట్స్లో కూడా ట్రోల్స్ చేశారు. అయితే ట్రోల్స్ చేస్తున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి.. అంతటితో ఆగకుండా.. ధోనీ ఐదేళ్ల కూతురిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన వ్యాఖ్యల్ని చూసి.. సగటు సోషల్ మీడియా యూజర్లు ఖంగుతిన్నారు. సదరు వ్యక్తి ధోని కూతురిపై చేసిన వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చిన్నారిపై ఇలాంటి లైంగిక వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు. అంతేకాదు.. మరో వ్యక్తి ధోని కూతురిపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో అహ్మదాబాద్ పోలీసులను కోరాడు. నిందితుడు చేసిన వ్యాఖ్యలతో పాటు.. అతడి డిటెయిల్స్ను కొన్ని జతచేసి పోస్ట్ చేశారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో ప్రమాదమని వ్యాఖ్యానించారు.