భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం.. భయంతో వణికిపోయిన మరో ఉగ్రవాది..!

Spread the love

లోయలో ఉగ్రవేట కొనసాగుతోంది. సరిహద్దు దాటి దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలకు భారత సైన్యం చెక్ పెడుతోంది. ఓ వైపు పాక్‌ సైన్యం నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ బాంబుల వర్షం కురిపిస్తోంది. అదే సమయంలో ఉగ్రవాదులు సరిహద్దు దాటి.. దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు లోయలోకి చొరబడ్డట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం నిత్యం కూంబింగ్ నిర్వహిస్తోంది.

తాజాగా షోపియాన్‌ జిల్లాలో శుక్రవారం నాడు భద్రతా బలగాలు జరిపిన కూంబింగ్‌.. ఎన్‌కౌంటర్‌గా మారింది. జిల్లాలోని కిలూరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే వీరిని హతమార్చడంతో వణికిపోయిన మరో ఉగ్రవాది.. భయంతో సైన్యానికి లొంగిపోయాడు. ఈ విషయాన్ని భారత ఆర్మీ ధృవీకరించింది. మరోవైపు కూంబింగ్‌ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

కాగా, మృతిచెందిన ఉగ్రవాదులు షకూర్‌ పార్రీ, అల్‌ బద్ర్‌ జిల్లా కమాండర్‌, మరో ఉగ్రవాదిని సుహైల్‌ భట్‌గా గుర్తించారు. ఇందులో సుహైల్‌ భట్‌ కన్‌మోహ్‌ గ్రామ సర్పంచ్‌ను కిడ్నాప్‌ చేసి చంపేసిన ఉగ్రవాదిగా గుర్తించారు. ఈ ఎన్కౌంటర్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని కశ్మీర్ పోలీసు ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఇక ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. లొంగిపోయిన ఉగ్రవాదిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.


Spread the love
error: Content is protected !!