దేశంలో రోజురోజుకు సాధు, సంత్లపై దాడులు పెరుగుతున్నాయి. పలుచోట్ల ఆలయలకు చెందిన పూజారులపై కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. పలు ఘటనలో విషాద చాయలు మిగులుతున్నాయి. గతంలో మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటుచేసుకున్న సాధువుల జంట హత్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఘటన సాక్షాత్తు పోలీసులు అక్కడే ఉండగా చోటుచేసుకుంది. పాల్ఘర్ సమీపంలోని ఓ గ్రామంలో సాధువులపై మూకదాడి చేశారు. అయితే వారు కాపాడాలంటూ పోలీసులను వేడుకున్పప్పటికీ.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఘటనకు సంబంధించి వంద మందికి పైగా అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత యూపీలోని బులంద్ షెహర్లోని ఓ ఆలయ సమీపంలో సాధువును హత్య చోటుచేసుకుంది. హర్యానా, పంజాబ్ ప్రాంతంలో కూడా ఓ సంత్పై దాడి జరిగినట్లు సమాచారం.
ఈ వరుస సంఘటనలన్నీ.. ఇటీవల చోటుచేసుకున్నవే. అయితే ఇదిలావుంటే.. బీహార్లో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని లఖిసరయి అనే ప్రాంతంలో నక్సలైట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. శ్రీన్గరిషీ ధామ్ ఆలయ పూజారి నీరజ్ జాను మావోయిస్టులు కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత అతి కిరాతకంగా హతమార్చారు. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సమయంలో.. ఆగస్టు 22వ తేదీన నక్సల్స్ కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయన కుటుంబాన్ని కోటి రూపాయలు డిమాండ్ చేశారు. అయితే వారు అంత డబ్బులు ఇవ్వలేమని నక్సలైట్లతో వేడుకున్నారు. అయినప్పటికీ మీకు 12 గంటల సమయం ఇస్తున్నామని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరు ఊహించలేరని హెచ్చరించారు. అయితే తమ దగ్గర అంత డబ్బులేదని మరోసారి కిడ్నాప్ చేసిన నక్సలైట్లకు వెల్లడించారు. దీంతో నక్సలైట్లు రూ.25లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
అయితే ఈ క్రమంలో పోలీసులు కూడా పూజారిని విడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పలువురు నక్సలైట్లను అరెస్ట్ చేశారు. సమీప అడవుల్లో పోలీసులు జల్లెడ పట్టసాగారు. కూబింగ్ విస్తృతంగా జరుపుతుండటంతో రెచ్చిపోయిన నక్సలైట్లు.. ఆ పూజారిని దారుణంగా హతమార్చారు. పోలీసులు పలువురు నక్సలైట్లను అరెస్ట్ చేయడంతో ఆగ్రహం చెంది.. ఈ ఘటనకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. పూజారి నీరజ్ జాను హతమార్చిన తర్వాత.. విషయాన్ని మృతుడి తండ్రికి చెప్తూ.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో నక్సలైట్లు చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. అక్కడ పడిఉన్న మృతదేహాన్ని చూడటంతో భయబ్రాంతులకు గురయ్యారు. చాలా సేపటివరకు మృతదేహాన్ని కూడా గుర్తించలేకపోయారని స్థానికులు తెలిపారు. అయితే ఓ ఆలయ పూజారిని నక్సలైట్లు ఎందుకు టార్గెట్ చేశారన్న దానిపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్థానిక హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.