రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. నిన్న కన్నడ నాట జరిగిన రాజకీయం గురించి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో ఆపరేషన్ కమల్ స్టార్ట్ అయ్యింది. కానీ ఎక్కడ కూడా ప్రత్యక్షంగా బీజేపీ అని తెలియదు. ఎందుకంటే జేడీయూ నుండి సీఎం బాధ్యతలు చేపట్టిన కుమారస్వామికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. కన్నడలో కాంగ్రెస్-జేడీయూ ల సంకీర్ణ ప్రభుత్వాన్ని సొంత పార్టీ వాళ్లే కూల్చేశారు. దాదాపు 15 మందిపై అనర్హత వేటు పడటంతో కావాల్సిన సంఖ్యాబలం లేకుండా పోయింది. అదేసమయంలో బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం.. బీజేపీ నెగ్గడంతో కన్నడ నాట మల్లి కమలం వికసించింది.
ఇక తాజాగా మధ్యప్రదేశ్ కమలానికి కంచుకోట లాంటిది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కమలం చేజారి… హస్తమయమైంది. దీనితో అప్పటినుండి భయం గుప్పిట్లోనే కమలనాథ్ ప్రభుత్వం నడుస్తుంది. అందుకు కారణం ఎప్పుడు ఎవరు కమలం గూటికి చేరతారో అన్న భయం. ఇతర పార్టీలలో ఉన్నవారు కూడా ఎప్పుడు చేయి ఇస్తారో తెలియని పరిస్థితి. అలా అనుకుంటూ ఏడాదిన్నర పాటు కూడా సాగిందో లేదో… కమలనాథ్ సర్కార్ కు కమలం పార్టీ పరోక్షంగా భారీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కుడిభుజం లాంటి జ్యోతిరాదిత్య సింధియాకు గాలం వేసింది. అయితే ఇక్కడ సీఎం కమలనాథ్ కు,సిండియాకు మధ్య కోల్డ్ వార్ రన్ అవుతుంది. సిండియాకు సీఎం పీఠం దక్కపోవడంత పార్టీపై అసహనంతో ఉన్నాడు. అదే సమయంలో వీలున్నప్పుడల్లా పార్టీపై కమల్నాథ్ సర్కారుపై విమర్శలకు దిగాడు. మొత్తానికి 17మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కమలనాథ్ సర్కార్ కూలిపోయేలా చేసారు. అయితే కమల్నాథ్ సర్కార్ మాత్రం పూర్తి ఐదేళ్ళ పరిపాలిస్తాం అని చెప్పుకొస్తుంది. ఇది ఇలా ఉంటె ఇప్పుడు రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి త్వరలో భారీ షాక్ తగలబోతుందన్న వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఎందుకంటే రాజస్తాన్లో కూడా స్వల్ప మెజార్టీతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఆ రాష్ట్రంలో కూడా సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. రాష్ట్రంలోని కోటాలో చిన్నారుల మృతి దగ్గర్నుంచి.. అనేక విషయాల్లో సచిన్ పైలట్ బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.
మధ్యప్రదేశ్ తరహాలోనే సచిన్ పైలట్పై కూడా ఆపరేషన్ కమల్ను ప్రయోగిస్తే.. హస్తం నుండి మరో రాష్ట్రము కూడా చేజారిపోతుంది. రాజస్తాన్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల బలం 200 కాగా కాంగ్రెస్కు 112 మంది సభ్యుల సపోర్ట్ ఉండగా.. వీరిలో సీపీఎం నుంచి ముగ్గురు, ఆర్ఎల్డీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక బీజేపీకి సొంతంగా 80 మంది సభ్యులున్నారు. ఓ 20 మందిని తమ వైపుకి లాక్కుంటే రాజస్తాన్ కూడా బీజేపీ ఖాతాలోకి పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వ లోపమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.