2024లో నరేంద్ర మోదీని ప్రధానిగా కావాలంటే బీజేపీ శ్రేణులు ఏం చేయాలన్నదానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన “మేరా పరివార్- బీజేపీ పరివార్” అన్న కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన షా.. 2024లో ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీని చూడాలంటే.. 2022లో యూపీలో జరిగే ఎన్నికల్లో యోగీని మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూపీని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని.. 2017లో పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను 90 శాతం నెరవేర్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో గతంలో శాంతిభద్రతల విషయాన్నిగమనిస్తే.. ప్రజలు కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కేవారు కాదని.. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఉందన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే గ్యాంగ్స్టర్లు, మాఫీయా డాన్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. ఈ విషయం యావత్ భారత ప్రజలకు తెలుసన్నారు.
మరో రెండు నెలల్లో మిగిలిన 10శాతం హామీలను కూడా నెరవేర్చుతామని.. మ్యానిఫెస్టోలో ఉన్న ప్రతి హామీని సీఎం యోగీ నెరవేర్చుతారన్న విషయాన్ని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఉన్న వాటిని నెరవేర్చడం.. తద్వారా ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచడం అన్నది బీజేపీ విధానం అని.. బీజేపీ ఏది చెబుతుందో.. అది ఖచ్చితంగా చేస్తుందని అమిత్ షా అన్నారు.
2014, 2019లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ ఏర్పడటంలో యూపీ ప్రజల కృషి ఎంతో ఉందని.. అలాగే 2024లో కూడా మరోసారి నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిగా చేయాలంటే.. అది యూపీ ప్రజల వల్లే సాధ్యమవుతుందన్నారు. అందుకు 2022లో యూపీ ఓటర్లంతా మరోసారి యోగీని ముఖ్యమంత్రిని చేయాల్సి ఉంటుందన్నారు. 2022లో 300కు పైగా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని.. ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి వస్తారని షా ధీమా వ్యక్తం చేశారు.
కాగా, 2017 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ 39.67 శాతం ఓట్లతో 312 అసెంబ్లీ స్థానాల్లో విజయ కేతనం ఎగరవేసింది. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) 47 సీట్లు, బీఎస్పీ 19, కాంగ్రెస్ 7 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాయి.