దేశంలో అత్యధిక ప్రజాధరణ పొందిన జాతీయ పార్టీ ప్రస్తుతం బీజేపీనే. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో యాభై శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించి.. నరేంద్ర మోదీ సారథ్యంలో మరోసారి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ.. ఏపీలో మాత్రం ఒక్క శాతం ఓటు బ్యాంకును కూడా పొందలేకపోయింది. ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష బాధ్యత గడువు ముగియడం.. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించడం తెలిసిందే.
అయితే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కాస్త దూకుడు పెంచినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనన్న రేంజ్లో దూసుకుపోతుండటం.. క్షేత్ర స్థాయిలో ఉన్న క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారం నాడు కొత్త కమిటీని ప్రకటించారు.
తాజా కమిటీలో.. పది మంది వైస్ ప్రెసిడెంట్స్, ఐదుగురు జనరల్ సెక్రటరీలు, పది మంది సెక్రటరీలను నియమించారు.ఆరుగురు స్పోక్స్ పర్సన్స్తో పాటుగా.. పలు రాష్ట్ర మోర్చాలకు కూడా అధ్యక్షులను ప్రకటించారు. అంతేకాదు.. ట్రెజరర్తో పాటు.. ఆఫీస్ సెక్రటరీని కూడా ప్రకటించారు.