ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనలో నిత్యం ఎక్కడో ఓ చోట పేలుళ్లు, దాడులు జరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు ఆఫ్ఘన్లోని నంగర్హర్ ప్రావిన్స్ టైలీ నగరంలో ఉన్న ఓ మసీదులో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. తాలిబన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 35 మందికి పైగా గాయపడగా.. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల విషయంపై అధికారికంగా తాలిబన్ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
షియా ముస్లింలు లక్ష్యంగా…
అయితే గత కొద్ది రోజులుగా నిత్యం జరుగుతున్న ఈ బాంబు దాడులు షియా ముస్లింలే లక్ష్యంగా జరుగుతున్నాయి. ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థగా ఉన్న ఐఎస్ఐఎల్ ఉగ్రసంస్థ ఇటీవల ఖోరాసన్ ప్రావిన్స్లో బాంబు దాడులు జరిపింది. ముఖ్యంగా శుక్రవారం రోజున షియా ముస్లింలు ఎక్కువగా హాజరయ్యే మసీదులను టార్గెట్గా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దీంతో షియాలను లక్ష్యంగా చేసుకునే ఈ పేలుళ్లు జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. అయితే తాజాగా జరిగిన దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ కూడా బాధ్యత వహించలేదని సమాచారం.
Blast reported in mosque in Nangarhar Province, Afghanistan. At least 12 wounded: Reuters
— ANI (@ANI) November 12, 2021