లొంగిపోతే సరే సరే..రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారో.. కాల్చి పారేస్తాం..!

Spread the love

జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు భ్రదతా బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. లోయలో అలజడి సృష్టించే ఉగ్రవాద మూకలను అణచివేస్తూ లోయలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకువచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటికే లోయలోని అనేక ప్రాంతాల్లో ఉగ్ర అలజడి తగ్గింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉగ్రవాద సానుభూతి పరులు ఉండటం.. యువతను సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదానికి ప్రభావితం చేస్తూ రిక్రూట్‌మెంట్‌ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది.

తాజాగా షోపియాన్‌, నౌబాగ్‌లోని ట్రాల్‌ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరికలు చేసినప్పటికీ.. మసీదులో ఉండి పోలీసులు, భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ రెండు ఘటనల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఆయుధాలను చేతపట్టుకుంటే హతమార్చుతామంటూ శ్రీనగర్‌కు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌, జనరల్ ఆఫీసర్‌ కమాండింగ్‌ (జీఓసీ) దేవేంద్ర ప్రతాప్‌ పాండే అన్నారు. ఆయుధాలు ఉంటే వెంటనే తమకు లొంగిపోవాలని.. కాదని రాష్ట్రానికి వ్యతిరేకంగా చేతులో ఆయుధాలు పట్టుకుంటే చంపేస్తామంటూ హెచ్చరించారు.

విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి యువత ఆకర్షితం అవ్వకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. అదే తమ తొలి ప్రాధాన్యత అని అన్నారు. అంతేకాదు.. ఉగ్రవాదానికి ఆకర్షించేలా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొందరు పేరెంట్స్‌ వచ్చి తమతో వారి పిల్లల్ని జైల్లో పెట్టాలంటూ విన్నవించుకుంటున్నారని తెలిపారు. తమ పిల్లలు చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. వారిని జైలులో ఉంచాలని భద్రతా బలగాల వద్దకు వచ్చి వేడుకుంటున్నారని తెలిపారు. లోయలో ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశాలనికి కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ కూడా హాజరయ్యారు.


Spread the love
error: Content is protected !!