ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేకపోవడంతో రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు అనేక దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అందులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనిక్ సంస్థతో కలిసి తయారు చేస్తున్న వ్యాక్సిన్పైనే అంతా ఆశలు పెంచుకున్నారు. ఫస్ట్ స్టేజ్, సెంకండ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమవ్వడమే దీనికి కారణం.
అయితే కీలకమైన థర్డ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్లో ఈ వ్యాక్సిన్ను తీసుకున్న వలంటీర్లకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. బ్రిటన్లో వ్యాక్సిన్ తీసుకున్న ఓ వలంటీర్కు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని.. దీంతో ఫైనల్ స్టేజ్కు చేరుకున్న క్లినికల్ ట్రయల్స్కు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఈ విషయాన్ని ఆస్ట్రాజెనిక్ ప్రకటించిందని పలు అంతర్జాతీయ వార్త పత్రికలు ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. వ్యాక్సిన్ భద్రతకు సంబంధించిన పూర్తిస్థాయి రివ్యూ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
కాగా, ఏ వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడైనా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని.. లోపాలను గుర్తించి సరిచేసుకుని తిరిగి ట్రయల్స్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం థర్డ్ స్టేజ్లో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్తో పాటు మరో 8 వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఇలా ట్రయల్స్లో సైడ్ ఎఫెక్ట్ వచ్చిన తొలి వ్యాక్సిన్ ఇదే.