దేశంలో పబ్జీ గేమ్కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. దాదాపు 70 కోట్లకు పైగా ఈ మొబైల్ యాప్ గేమ్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గేమ్ను ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతో గూగుల్ ప్లేస్టోర్తో పాటుగా యాపిల్ ప్లే స్టోర్ నుంచి కూడా దీనిని తొలగించారు. దేశ భద్రత నేపథ్యంలో 118 యాప్స్ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. వీటిలో పబ్జీ గేమ్ కూడా ఒకటి. అయితే ఈ గేమ్పై నిషేధం విధించడంతో ఎంతో మంది నిరుత్సాహానికి గురయ్యారు. అయితే అదే సమయంలో ఈ కంపెనీ కూడా లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. అయితే పబ్జీ గేమ్కు అడిక్ట్ అయిన వారి కోసం ప్రత్యామ్నాయంగా ఇతర గేమ్స్ను తీర్చిదిద్దేందుకు స్వదేశీ డెవలపర్స్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓ గుడ్న్యూస్ చెప్పారు. పబ్జీని మర్చిపోయేలా.. అంతకు మించిన మొబైల్ గేమింగ్ యాప్ను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా పబ్జీని తలదన్నే రీతిలో మల్టీ ప్లేయర్ గేమ్ అని తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన “ఆత్మ నిర్భర్ భారత్” మూమెంట్లో భాగంగా ఈ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ను తీసుకువస్తున్నట్లు అక్షయ్ కుమార్ ప్రకటించారు. దీనికి “ఫౌజీ” అని నామకరణం చేశారు. ఫౌజీ అంటే ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ అని తెలిపారు. త్వరలోనే ఇది రాబోతుందని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
“ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా ఈ “ఫౌజీ” మొబైల్ గేమ్ యాప్ను తీసుకువస్తున్నాం. ఇది కేవలం వినోదం కోసమే కాదు.. మన జవాన్ల త్యాగాలను కూడా తెలియజేయనుంది. ఈ మొబైల్ గేమ్ ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం భారత్కా వీర్ ట్రస్ట్కు అందజేయనున్నాం” అంటూ అక్షయ్ కుమార్ తన ట్విట్టర్లో ప్రకటించారు. అంతేకాదు.. ఈ గేమ్కు సంబంధించిన వాల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. దీనిని బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ రూపొందిస్తోంది. దీనికి అక్షయ్ కుమార్ మెంటర్గా వ్యవహరించనున్నారు.
కాగా, ఓ మొబైల్ గేమ్ యాప్లో వచ్చిన ఆదాయాన్ని 20 శాతం భారత్కా వీర్ ట్రస్ట్కు ఇవ్వనున్నట్లు అక్షయ్ చేసిన ప్రకటనపై జాతీయ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విదేశీ గేమింగ్ యాప్స్ ద్వారా.. మన దేశ ఖజానా సరిహద్దులు దాటిందని.. ఇలా స్వదేశీ యాప్ల వాడకం పెరగడం ద్వారా.. మన దేశ ఖజానా మనవద్దే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.