ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్నేళ్లుగా బజరంగ్ దళ్ పలు కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా పార్కుల్లో,క్లబ్లుల్లో తిరుగుతూ.. వాలంటైన్స్డేకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే ఈ సారి కూడా రాబోయే వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తున్నట్లు బజరంగ్ దళ్ పేర్కొంది. పాశ్చాత్య సంస్కృతి అయిన వాలంటైన్స్ డేను తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని డిమాండ్ చేసింది. ప్రేమ పేరుతో సంస్కృతిపై దాడి చేయడాన్ని బజరంగ్ దళ్ వ్యతిరేకిస్తుందని.. ప్రేమకు బజరంగ్ దళ్ వ్యతిరేకం కాదని తెలంగాణ ప్రాంత బజరంగ్ దళ్ సంయోజక్ సుభాష్ చందర్ అన్నారు. వాలంటైన్స్ డే నాడు బజరంగ్ దళ్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

రెండేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14వ తేదీన దేశ ప్రజల కోసం 40 మందికి పైగా జవాన్లు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో అమరులయ్యారని గుర్తు చేశారు. వారిని స్మరిస్తూ.. ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా శ్రద్దాంజలి కార్యక్రమం చేపట్టాలని బజరంగ్ దళ్ యువతకు పిలుపునిచ్చింది. వాలంటైన్ డే కాకుండా అమరవీర్ జవాన్ దివాస్గా జరపాలన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన గ్రీటింగ్ కార్డ్సు దహనం చేయబోతున్నట్లు బజరంగ్ దళ్ తెలిపింది.14వ తేదీన ఉవయ్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు తెలిపారు. సాయంత్రం నెక్లెస్ రోడ్డులో కాగడాల ప్రదర్శన చేపట్టబోతున్నట్లు బజరంగ్ దళ్ ప్రెస్మీట్లో వెల్లడించింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ ప్రాంత సంయోజక్ సుభాష్ చందర్, భాగ్యనగర్ విభాగ్ సంయోజక్ ముకేష్ యాదవ్, మహాంకాళి విభాగ్ సంయోజక్ శ్రీకాంత్, ప్రచార ప్రముఖ్ కైలాష్, అణుశక్తి జిల్లా సంయోజక్ సుమంత్ పాల్గొన్నారు.