వెస్ట్ బెంగాల్లో బీజేపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా అక్కడ రాజకీయ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ టీఎంసీనే ఈ దారుణాలకు పాల్పడుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆదివారం నాడు బీజేపీ కౌన్సిలర్ మనీష్ శుక్లాను నార్త్ 24 పరగణా జిల్లాలోని టిటాగర్ ప్రాంతంలో దారుణంగా హతమార్చారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
అధికార పార్టీ టీఎంసీనే ఈ దారుణానికి ఒడిగట్టిందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించిన కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ జాతీయ నేత కైలాష్ విజయ వర్గీయ డిమాండ్ చేశారు. మరోవైపు మనీష్ శుక్లా హత్యకు నిరసనగా సోమవారం నాడు 12 గంటలపాటు బరాక్పూర్లో బంద్ పిలుపులనిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ సింగ్ తెలిపారు.