దేశ రాజకీయాలు కీలకమైన యూపీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే మరో రెండేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే అక్కడ ప్రతిపక్ష పార్టీలు పక్కా ప్లాన్లు రచిస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చేలా తెరపైకి మరోపార్టీ పురుడు పోసుకుంది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్.. ఈ కొత్త పార్టీని ప్రారంభించారు. ఆదివారం యూపీలో జరిగిన బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి వేడుకల్లో ఈ కొత్తపార్టీ పేరును ప్రకటించారు. “ఆజాద్ సమాజ్ పార్టీ” గా ఈ కొత్త పార్టీకి పేరుపెట్టారు.
బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేపట్టిన మిషన్ ఇంకా పూర్తవ్వలేదని.. ఇప్పుడు ఈ కొత్తపార్టీతో దీనిని పూర్తిచేస్తామంటూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. 2022లో జరిగబోయే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా బీజేపీకి చెక్ పెట్టాలన్న యోజనలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ పార్టీలు చూస్తున్నాయి. ఈ క్రమంలో భీమ్ ఆర్మీ చీఫ్ తెరపైకి తెచ్చిన “ఆజాద్ సమాజ్ పార్టీ” ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఈ పార్టీ పోటీచేస్తే.. చీలిపోయేది.. ఎస్పీ, బీఎస్పీకి చెందిన ఓటు బ్యాంకేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి భీమ్ ఆర్మీ చీఫ్ కొత్త పార్టీతో యూపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారనున్నాయి.
ఒకవేళ “ఆజాద్ సమాజ్ పార్టీ” పార్టీ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే మాత్రం బీజేపీకి గడ్డు కష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.