హుజురాబాద్ బైపోల్లో కమల దళం భారీ విజయాన్ని అందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్ల లెక్కింపులో 20 రౌండ్లలో ఈటల మెజర్టీని సాధించారు. మొత్తం 23వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. దీంతో వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు పొందారు. 2004 నుంచి ఈటల రాజేందర్ వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.
కాగా, 20వ రౌండ్ వరకే ఈటల గెలుపుపై స్పష్టత రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సంబరాలు జరుపుకోంటుంది. నగరంలోని గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన బీజేపీ నేతలు.. స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్ అన్ని రకాలుగా గెలుపుకు ప్రయత్నాలు చేసిందని.. కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ.. ఈటల గెలుపును అడ్డుకోలేకపోయారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యంచెప్పుకోచ్చారు.