బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి మరో సారి సంచటన ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్నట్లు ట్వీట్స్ చెబుతున్నాయి. ఇటీవల జేఈఈ/నీట్ పరీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై పరోక్షంగా అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సామాన్యుడి పరిస్థితి గతంలో జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని తలపిస్తోందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా.. సోమవారం నాడు ఏకంగా సొంత పార్టీలో ఉన్న ఐటీ సెల్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ ఐటీ సెల్ ఓ రోగ్లా మారిందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఐటీ సెల్కు చెందిన కొందరు తనపై ఫేక్ ఐడీలతో టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఇలానే మీరు చేస్తూ పోతుంటే.. ఆగ్రహంతో ఉన్న నా అభిమానులు కౌంటర్ ఎటాక్కు దిగితే దానిని తనకు ఆపాదించవద్దంటూ ట్వీట్లో తెలిపారు. ఎలా అయితే బీజేపీ రోగ్ ఐటీ సెల్తో సంబంధం లేదని చేతులు దులుపుకుంటుందో.. అలానే తాను కూడా చెప్పాల్సి వస్తుందని పరోక్షంగా తెలిపారు. అయితే ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందింస్తుందన్నది వేచి చూడాల్సిందే.