రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో హత్యారాజకీయాలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేతలే లక్ష్యంగా వరుస కాల్పులు జరుగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం అర్ధరాత్రి యూపీలోని ప్రయాగ్రాజ్లో నివసిస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన నేత అజయ్ శర్మపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించారు. అజయ్ శర్మ బీజేపీ కిసాన్ మోర్చా చీఫ్గా ఉన్నారు.
నివేధికకల ప్రకారం.. దుండగులు అజయ్ శర్మ ఇంటి బయటే ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ముఖాలకు మాస్క్లు ధరించి రావడంతో దుండగులను ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ కాల్పుల్లో అజయ్శర్మ కడుపులోకి, భుజానికి బుల్లెట్లు తగిలాయి. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు స్థానిక ఎస్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అజయ్శర్మ తన కుటుంబంతో కలిసి ఫఫమౌ సమీపంలోని లెహ్రా గ్రామంలో నివసిస్తున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చినది గమనించి.. నలుగురు వ్యక్తులు తుపాకులతో దాడి చేశారు. అయితే వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయనను వెంటాడి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనాస్థలానికి పెద్ద ఎత్తున స్థానికులు గుమికూడటంతో దుండగులు కార్లు, బైక్లలో పారిపోయారు. ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ఫిర్యాదు అందనప్పటికీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విషయాన్ని ఫఫమౌ పోలీసు అధికారులు తెలిపారు.
Phaphamau | BJP worker Ajay Sharma injured due to bullet injuries in stomach and shoulders. Assailants intruded into his house and shot him: Prayagraj Police
— ANI UP (@ANINewsUP) November 9, 2021
15 రోజుల్లో రెండో ఘటన..
కాగా, యూపీలోని ప్రయాగ్రాజ్లో ఇలా బీజేపీ నేతలపై దాడులు జరగడం గత పదిహేను రోజుల్లో రెండోసారి. అక్టోబర్ 25వ తేదీన జిల్లాలోని గంగా ఝాన్సీ పోలీస్ స్టేషన్ సమీపంలో బీజేపీ మండల అధ్యక్షుడు అవధేష్ మౌర్యపై కాల్పులు జరిగాయి. మౌర్య తండ్రి సుభాష్ మౌర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని నిమిత్తం బయటకు వెళ్తుంటే దారిలో అడ్డుకుని కాల్పులు జరిపారని.. ఈ క్రమంలో తాము తప్పించుకునే సమయంలో తన కుమారుడికి గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనకు పాల్పడిన వారిలో ఒకరు ఇర్ఫాన్ అని.. అతడితో పాటు మరో వ్యక్తి పేరును కూడా ఎఫ్ఐఆర్లో తెలిపారు. అంతేకాదు బుజుర్గ్ గ్రామనికి చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పేర్కొన్నాడు.