ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్లోయలో బీజేపీకి చెందిన నేతల్నే టార్గెట్ చేస్తూ.. వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. బీజేపీలో ఉన్న ముస్లింలను కూడా బెదిరింపులకు గురిచేస్తూ.. హత్యాప్రయత్నాలకు దిగుతున్నారు. ఇప్పటికే లోయలోని గ్రామ సర్పంచ్ను గతంలో కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. పలువురు ఇతర కార్యకర్తలను కూడా కాల్చి చంపేశారు. తాజాగా.. మంగళవారం నాడు జమ్ముకశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో బీజేపీ నేతపై కాల్పులకు దిగారు ఉగ్రవాదులు.
జిల్లాలోని నూనుర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న గులామ్ ఖాద్రీపై గుర్తు తెలియని ఉగ్రవాదులు తుపాకీతో కాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో మహ్మద్ అల్తాఫ్ అనే కానిస్టేబుల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వీరమరణం పొందాడు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా, వ్యక్తి గత సిబ్బంది అప్రమత్తతో సదరు బీజేపీ నేత ప్రాణాలతో బయటపడ్డారు.