సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి తెలిసిందే. ఎప్పుడూ వివాదాలతోనే ఆయన వార్తల్లో నిలుస్తారన్నది మోజార్టీ ప్రజల అభిప్రాయం. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా.. దేశ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. అందుకు కారణం ఫేస్బుక్. ఈ సోషల్ మీడియా మాధ్యమం సదరు రాజాసింగ్ ఎమ్మెల్యేకు చెందిన ఫేస్బుక్ పేజీలపై నిషేధం విధించింది. ఈ పేజ్ల ద్వారా ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఫేస్బుక్ ఆరోపించింది. ఫేస్బుక్ నియమ నిబంధనలను రాజాసింగ్ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజ్లు పాటించడం లేదన్న కారణంగా బ్యాన్ విధించినట్లు ఫేస్బుక్ ప్రతినిధి వెల్లడించారు. ఫేస్బుక్ ద్వారా హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసేవారి అకౌంట్లు.. ఫేస్బుక్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై నిషేధం విధిస్తామని ప్రకటించింది.
ఇదిలావుంటే.. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం తన పేరుపై ఉన్న ఫేస్బుక్ పేజ్లను తొలగంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు తనకు అధికారిక ఫేస్బుక్ పేజ్ లేదని.. తన పేరుతో ఎంతో మంది పేజ్లను క్రియేట్ చేసి ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇక నియమ నిబంధనల విషయాలు కేవలం ఒక వర్గానికి మాత్రమే వర్తిస్తాయా..? బహిరంగంగా ఎంతో మంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే.. వారి అకౌంట్స్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తనకు అధికారిక పేజ్ లేదని.. ఏ పోస్టులకు కూడా తాను బాధ్యుడిని కాదని రాజాసింగ్ స్పష్టం చేశారు.
అంతేకాదు.. తన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ తొలగింపుపై ఫేస్బుక్కు ఏప్రిల్ 1వ తేదీ 2019లో ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్కు ఫిర్యాదు చేయడంతో పాటు.. అప్పటి నుంచి తాను ఫేస్బుక్ వాడటం లేదని తెలిపారు. ఇదిలావుంటే.. గతంలో 2018వ సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన తన పేరుపై ఉన్న ఫేస్బుక్ పేజ్ హ్యాక్కు గురైనట్లు సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయాలకు సంబంధించిన ట్విట్టర్ లింక్స్ను మరోసారి సెప్టెంబర్ 3వ తేదీన గుర్తుచేస్తూ.. ఫేస్బుక్ బ్యాన్ అంశంపై స్పందించారు.