ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను బీజేపీ-జనసేన పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇటీవల పీఠాపురంలో విగ్రహాల ధ్వంసం.. ఆ తర్వాత తాజాగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ రథం దగ్ధం ఘటనల గురించి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్వేది ఘటనపై హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వరుస ఘటనలపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ వరుస ఘటనలు జరుగుతున్నాయని.. పీఠాపురంలో నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగే అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అంతర్వేది రథం దగ్ధం ఘటనకు నిరసనగా.. నేడు గురువారం.. ఉదయం 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకు ఇళ్లలోనే ధర్నా నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమానికి జనసేన కూడా మద్దతు పలికింది.