తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం సమీపంలో ఓ ఆవు అటుగా అడ్డు రావడంతో కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ వెనుక ఉన్న రెండు వాహనాలు ఒకదానివెనుక ఒకటి ఢీ కొట్టుకున్నాయి. అయితే ఆ తర్వాతి వాహనంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్న వాహనం డ్రైవర్ వెంటనే అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది. అయితే ఓ వాహనం ముందు భాగం దెబ్బతింది. అందులో ఉన్న భద్రతా సిబ్బంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనంతరం చంద్రబాబు కాన్వాయ్ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.