సీఎం కేసీఆర్ హిందువుల అతిపెద్ద పండుగ అయిన దసర సందర్భంగా తీపికబురు తెలిపారు. ఇకపై ప్రతిఏటా దసర పండుగ అనంతరం మరుసటి రోజును కూడా సెలవు దినంగా ప్రకటించారు. ఈ నెల అక్టోబర్ 25వ తేదీన దసరా పండుగ ఉండగా.. 26వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతిఏటా కూడా ఈ సెలవు ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు కూడా జారీ చేశారు.
కాగా, ప్రతి ఏటా దసరా పండుగ వచ్చిందంటే నగర వాసులు దాదాపుగా గ్రామాలకు వెలుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు అయితే సద్దుల బతుకమ్మ పండుగ నుంచి.. దసరా వరకు ఎంతో ఉత్సాహంగా పండుగ సంబరాలు జరుపుకుంటారు. అయితే ఆ తర్వాత మరునాడే ఉద్యోగాలకు వెళ్లడం దాదాపు అందరికీ ఇబ్బందిగా మారుతోంది. పండుగ వాతావరణాన్ని ఆస్వాధించేందుకు ఎక్కువ మంది మరుసటి రోజు కూడా సెలవు పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.