ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు దేశ వ్యాప్తంగా అత్యవసర సర్వీసులు మినహా.. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. ప్రజా రవాణా, ప్రైవేట్ రవాణా కూడా స్థంభించిపోయింది. విదేశీ, దేశీ విమాన సర్వీసులు, రైల్వే ఇలా అన్ని నిలిచిపోయాయి. కేవలం కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇక మెజార్టీ ప్రజలందరికీ ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. ఈఎంఐలు ఉండనే ఉంటాయి. గృహ రుణాలు, వాహన రుణాలు, క్రాప్ లోన్లు.. క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్స్ ఇలా అనేకం ఉంటాయి. అయితే కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిపై మారటోరియం ప్రకటించింది.
అయితే అందరికీ ఈ మారటోరియం అంటే ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏదైనా లోన్ పొందిన తర్వాత దాన్ని రిటర్న్ చెల్లించేందుకు సదరు బ్యాంకులు కానీ.. ఫైనాన్షియల్ కంపెనీలు కానీ ఇచ్చే గడువును మారటోరియం అంటారు. ఉదాహరణకు.. ఒక స్టూడెంట్ ఎడ్యూకేషన్ లోన్ తీసుకుంటే..ఆ స్టూడెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత లోన్ వాయిదా రూపంలో చెల్లించడం ప్రారంభింస్తాడు. ఈ సమయాన్నే మారటోరియం అంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రెపో రేటు తగ్గింపు, లోన్ ఈఎంఐలపై 3 నెలల మారటోరియం వంటివి కూడా ఉన్నాయి. ఆర్బీఐ రేట్ల కోత వల్ల లోన్లపై ఇంట్రెస్ట్ రేట్లు బాగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు క్రెడిట్ కార్డు కలిగిన వారికి అనేక డౌట్స్ వచ్చే అవకాశముంది. ఇంకా మూడు నెలలపాటు ఈఎంఐ కట్టకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతినదా? అనే ప్రశ్నలు కూడా చాలా మందికి వచ్చే ఉంటాయి.
ఈ ఆర్బీఐ మారటోరియం ఏ ఏ రుణాలకు…?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియంపై చాలా స్పష్టంగా తెలియజేసింది. టర్మ్ లోన్స్కు ఇది వర్తిస్తుందని పేర్కొంది. అంటే గృహ రుణాలు, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి రుణాలన్నింటికి ఈ మారటోరియం వర్తిస్తుంది. ఇంకా కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్కు కూడా మారటోరియం ఉంటుంది. అంటే ఫ్రిజ్, స్మార్ట్ఫోన్, టీవీ వంటి వాటి కొనుగోలుకు రుణం తీసుకున్న వారు కూడా ఈఎంఐ కట్టక్కర్లేదు. అయితే బ్యాంకులు.. లోన్స్ ఇచ్చిన సంస్థలపై ఇది ఆధారపడి ఉంటుంది.
బ్యాంకు ఖాతా నుంచి ఈఎంఐ కట్ అవుతుందా..?
ఈ విషయంలో మీరంతా సదరు బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేవలం మారటోరియం సదుపాయాన్ని మాత్రమే కల్పించాలని బ్యాంకులకు సూచించింది. అంటే.. ఈ నిర్ణయం తీసుకోవడం అనేది బ్యాంకుపైనే ఆధారపడి ఉంటుంది. బ్యాంకులు ఈఎంఐ డబ్బులను కట్ చేసుకోవాలా..లేదా అనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే సదరు బ్యాంక్ నుంచి ఎలాంటి అప్రూవల్ రాకపోతే.. ఖాతా నుంచి ఈఎంఐ డబ్బులు కట్ అవుతాయి. కాబట్టి.. మారటోరియం గురించి మీమీ బ్యాంకు అధికారులను సంప్రదించడం ఉత్తమం.
బిజినెస్ లోన్స్కు సంబంధించిన వాటిపై..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాపార రుణాల గురించి కూడా వివరణ ఇచ్చింది. అన్ని వర్కింగ్ క్యాపిటల్ లోన్స్కు వడ్డీ చెల్లింపుపై మారటోరియం ఫెసిలిటీని కల్పించింది. దీంతో వ్యాపార రుణాలు తీసుకున్న వారు.. వడ్డీ చెల్లిపులను మూడు నెలల మారటోరియం తర్వాత కట్టేయవచ్చు.
ఆర్బీఐ గైడ్లైన్స్తో బ్యాంకులు ఏం చేస్తాయి..?
ఆర్బీఐ మూడు నెలల మారటోరియం ప్రకటించిన నేపథ్యంలో.. బ్యాంకులన్నీ దీనిపై చర్చిస్తాయి. బోర్డు స్థాయిలో ఈ అంశంపై చర్చలు జరిగిన తర్వాత..ఒక నిర్ణయానికి వచ్చి.. ఏం నిర్ణయం తీసుకున్నారన్న దానిపై కస్టమర్లకు స్పష్టతనిస్తూ.. విషయాన్ని తెలియజేస్తాయి.
ఇంతకు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలా? వద్దా..?
ఎక్కువ మందికి ఉన్న అనుమానం ఇది. ఇంతకు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అన్నది మెజార్టీ కస్టమర్లకు ఉన్న అనుమానం. అయితే.. మారిటోరియం అనేది క్రెడిట్ కార్డులకు వర్తిస్తుందా లేదా అన్న దానిపై అనిశ్చితి నెలకొంది. వాస్తవానికి ఇవి టర్మ్లోన్ కిందకు రావు. అయితే ఆర్బీఐ తర్వాత దీనిపై క్లారిటీ ఇచ్చింది. క్రెడిట్ కార్డు పేమెంట్స్ కూడా ఈఎంఐ మారటోరియం కిందకు వస్తాయని తెలిపింది. దీంతో క్రెడిట్ కార్డు బిల్లులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మీ మీ బ్యాంకుల నుంచి స్పష్టమైన సందేశాలు వస్తేనే బిల్లులు చెల్లించకండి. లేదంటే వెంటనే గడువులోగా బిల్లు కట్టేయండి. ఎందుకంటే మళ్లీ క్రెడిట్ కార్డు పెనాల్టీలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఏ ఏ బ్యాంక్ కస్టమర్ల.. లోన్ వాయిదాలను చెల్లించాల్సిన అవసరం లేదు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు చెందిన కస్టమర్లు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వీటి నుంచి కస్టమర్లకు ఈఎంఐ గురించిన సమాచారం వస్తుంది. లేని పక్షంలో ఎప్పటిలాగే కట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో అన్ని బ్యాంకులు మూడు నెలల పాటు సడలింపు ఇచ్చే అవకాశం ఉంది.
ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
అయితే ఈఎంఐలు కట్టక్కర్లేదని ఉన్న డబ్బులను వృథా చేస్తే.. మళ్లీ మూడు నెలల తర్వాత కట్టాల్సి ఉంటుంది. ఈఎంఐ కట్టక్కర్లేదంటే కేవలం వాయిదా వేశారని అర్థం. మళ్లీ మూడు నెలల తర్వాత ఎప్పటిలాగే ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. మీ లోన్ టెన్యూర్ 3 నెలలు పెరుగుతుంది. అంతేకానీ.. మినహాయింపుగా ఊహించుకోవద్దు.