దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో అన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిపోతున్నాయి. ఇప్పటికే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్కు చేరువైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతన్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికా తర్వాత బ్రెజిల్, భారత్లోనే నమోదవుతున్నాయి. ఇక ప్రస్త్తుతం బ్రెజిల్, భారత్ల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. భారత్లో ఇదే విధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే మరో రెండు రోజుల్లో బ్రెజిల్ను దాటేసి.. రెండో స్థానానికి చేరుతుంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా రికార్డులు బ్రేక్ చేసేలా 90 వేల మార్క్ను దాటేశాయి. మొత్తం దేశ వ్యాప్తంగా 90,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,13,812కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 31.80 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8.62 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, రోజురోజుకు కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం రికార్డు స్థాయిలో 70 వేల మందికి పైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు రోజురోజుకు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య కూడా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.