దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా రోజు 90 వేల మార్క్ను దాటేస్తూ.. లక్ష మార్క్ను చేరేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు రోజుకు దేశ వ్యాప్తంగా పది లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు రోజురోజుకు కరోనా పరీక్షల సంఖ్య పెంచుతుండటంతో.. కేసుల సంఖ్య పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెంచడం ద్వారా వైరస్ సోకిన వారిని గుర్తించడం.. ఆ తర్వాత వారి కాంటాక్ట్ కేసులను గుర్తించడం ద్వారా.. వైరస్ వ్యాప్తి విస్తరించకుండా అడ్డుకోవచ్చు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 11వ తేదీ నాటికి 5.5 కోట్లకు పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు 46 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 97,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,59,985కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 36,24,197 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,58,316 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.