దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో రెండో స్థానంలో ఉండటమే కాకుండా.. అత్యధిక కేసులు నమోదైన అగ్రరాజ్యం అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ కొనసాగుతోంది. ఇక రష్యాలో రోజు 5 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మన దేశంలో రోజుకు లక్షకు చేరువయ్యేలా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 90,123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,20,360కి చేరింది. ఇక వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 39,42,361 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9.95 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ప్రతి రోజు 10 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా 11.16 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5.94 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.