మహారాష్ట్ర రాజకీయాల గురించి తెలిసిందే. తొలుత బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లను గెలుచుకున్నాయి. అయితే సీఎం సీటుకు వచ్చిన కొట్లాటలో.. బీజేపీకి హ్యాండ్ ఇచ్చి.. హస్తం పార్టీతో పాటు ఎన్సీపీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. దీనికంటే ముందు ఎన్సీపీ నుంచి ఓ వర్గం మద్దతు ఇస్తుందంటూ బీజేపీతో కలిసి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ తర్వాత బలపరీక్ష నాటికి మళ్లీ వెనక్కి తగ్గింది బీజేపీ. దీంతో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
గతేడాది నవంబర్ 28న సీఎంగా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు సీఎం పదవికి గండం ఏర్పడింది. అందుకు కారణం.. గతేడాది సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఇప్పటి వరకు అటు అసెంబ్లీలో కానీ.. మండలి సభల్లో కానీ ఆయన ప్రాతినిధ్యం వహించట్లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోగా.. ఉభయ సభల్లో ఏదోఒక దానికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే వచ్చే మే 28 నాటికి ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు పూర్తవుతుంది. అయితే ఇప్పటి వరకు ఉద్ధవ్ ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహించట్లేదు. అటు శాసనమండలికి నామినేట్ చేయాలని ఉద్ధవ్ కేబినెట్ సిఫారసు చేసినప్పటికీ.. వివిధ కోటాలో జరగాల్సిన మండలి ఎన్నికలు కరోనా ఎఫెక్ట్తో నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
కాగా.. లెక్క ప్రకారం… గత నెల మార్చి 26న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదే ఇప్పుడు ఉద్ధవ్కు టెన్షన్ టెన్షన్ పెడుతోంది. అయితే ఈ క్రమంలో ఎన్సీపీ నేత, మంత్రి అజిత్ పవార్ రంగంలోకి దిగి… గవర్నర్ కోటా నుంచి ఉద్ధవ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని
గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత గవర్నర్ కోటా నుంచి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్.. సాహిత్యం, కళలు, సామాజిక కార్యకర్త, వివిధ కళల్లో నిష్ణాతులైన వారిని గవర్నర్ తన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అధికారం ఉంది. ఈ అంశాల్లో ఉద్ధవ్ ఏ ఒక్క రంగానికి చెందిన వారు కాదు. దీంతో గవర్నర్ ఉద్దవ్ను నామినేట్ చేయడం అనుమానమే. అయితే..
ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం అనేది పూర్తిగా గవర్నర్ విచక్షణాధికారానికి చెందుతుంది. ఆయన ఏవరినైనా నామినేట్ చేయవచ్చు. సీఎం ఉద్ధవ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ మంత్రి అజిత్ పవార్ సూచనలపై గవర్నర్ స్పందించలేదని తెలుస్తోంది. దీంతో అధికార శివసేనా.. గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఉద్దవ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గవర్నర్ కోటాలో ఉద్ధవ్ను ఎంపిక చేయడం సరి కాదంటూ ప్రతిపక్ష బీజేపీ వాదిస్తోంది.
మొత్తానికి ఇప్పుడు మే 28 తేదీ.. ఉద్ధవ్ థాక్రేకు ఎంతో కీలకం కానుంది. అప్పటి వరకు మరి గవర్నర్ మనసు కరిగి అతన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.సాంకేతిక పరంగా చూస్తే మాత్రం.. గవర్నర్ ఎమ్మెల్సీగా ఎన్నుకోకపోతే.. ఇక మే 28 న సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్లీ సీఎం
పదవి చేపడతారా.. లేక శివసేన నుంచి మరెవరికైనా పగ్గాలు అప్పగిస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఒకవేళ గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే. .ఈ ఊహాగానాలన్నింటికి చెక్ పడుతుంది.