కరోనాపై విజయం.. దేశ వ్యాప్తంగా 2.61 లక్షల మంది.. తెలంగాణలో 5,093 మంది..

Spread the love

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. గత రెండు మూడు రోజులుగా కరోనా మహమ్మారిని జయిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. మాస్క్‌, సోషల్ డిస్టెన్స్‌ వంటివి పాటిస్తుండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి ఏకంగా 2.61 లక్షల మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు రోజు కూడా 2.5 లక్షల మంది వరకు కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 3.60 లక్షల మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడ్డ వారి సంఖ్య 1.79 కోట్లకు చేరింది. ఇక కరోనా మహమ్మారి నుంచి 2,61,162 మంది బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.48 కోట్ల మంది కరోనా మహమ్మారిని జయించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 29.78 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 3 వేల మందికి పైగా మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనాబారినపడి 2.01 లక్షల మంది మరణించారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా కాస్త తగ్గింది. మంగళవారం 10 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. బుధవారం నాడు 8 వేల కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య విడుదల చేసిన బులిటెన్‌ ద్వారా అర్ధమవుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 8,061 మందికి కరోనా పాజిటివ్ రాగా.. 5,093 మంది ఈ మహమ్మారిని జయించారు. ఇక కరోనా మహమ్మారి బారినపడి 56 మంది మరణించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. విధిగా మాస్కులు ధరిస్తూ. భౌతిక దూరం పాటించాలని.. చేతులు తరుచుగా కడుగుతూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో దూసుకెళ్తున్న భారత్‌

ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా అతివేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 14.78 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయగా.. ఇక మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడ్డ వారందరికీ వేయనున్నారు. అందుకోసం నేటి నుంచి రిజిస్టేషన్లు ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌ అత్యంత వేగంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

 


Spread the love
error: Content is protected !!