చైనా రాయబారిని లక్ష్యంగా చేసుకుని పాక్లో భారీ బ్లాస్ట్ చోటుచేసుకుంది. బుధవారం రాత్రి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని రాజధాని క్వెట్టాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో చైనా రాయబారి తన బృందంతో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో క్వెట్టాలోని ఓ ప్రముఖ హోటల్లో బస చేస్తున్నారు. అయితే ఈ హోటల్ బయట పార్కింగ్ ప్రదేశంలో ఓ కారు బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్లోనే మరణించారు. మరో పన్నెండు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, దుండగులు కారులో ఐఈడీ బాంబును అమర్చ ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. పాకిస్టాన్ ఇంటీరియర్ మంత్రి షేక్ రషీద్ మాట్లాడుతూ.. దాడి జరిగిన సమయంలో హోటల్లో చైనా రయబారి లేరని పేర్కొన్నారు.
అయితే ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామేనంటూ ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. దాడి ఎవరు చేశారన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నామన్నారు. కారులో ఐఈడీని అమర్చి పేల్చినట్లు నిర్ధారించుకున్నామని.. గతంలో కూడా బలూచిస్తాన్ ప్రాంతంలో ఇలాంటి పేలుళ్లు చోటుచేసుకున్నాయన్నారు. గతేడాది జూన్ మాసంలో చైనాకు చెందిన ఓ కంపెనీ పెట్టుబడులు పెట్టిన క్రమంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్పై దాడి జరిగింది. కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్పై జరిగిన దాడికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని పాక్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.