సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా బీహర్ ఎన్నికల షెడ్యూల్తో పాటుగా.. పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణ ప్రాంతంలోని దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. షెడ్యూల్ వివరాలు చూస్తే..
బై పోల్ షెడ్యూల్
- అక్టోబర్ 9న బై పోల్ నోటిఫికేషన్
- నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 16
- అక్టోబర్ 17వ తేదీన నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 19
- నవంబర్ 3వ తేదీన పోలింగ్
- నవంబర్ 10వ తేదీన కౌంటింగ్ ( ఫలితాలు)
కాగా, దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు మంత్రి హరీష్ రావు ప్రచారం ప్రారంభించగా.. మరోవైపు కమలం పార్టీ నుంచి రఘునందన్ రావు గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. ప్రతిరోజు గ్రామగ్రామాన తిరుగుతూ.. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు మంత్రి హరీష్ రావు కూడా ఎలాగైనా ఇక్కడి స్థానాన్ని మళ్లీ కారు ఖాతాలో జమ చేయాలన్న టార్గెట్తో ప్రచారం చేపడుతున్నారు.
ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతోంది. అయితే అన్ని పార్టీలు వారి వారి అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత మరింత హీటెక్కనుంది. ఇదిలావుంటే ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో.. మంగళవారం నుంచే దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.