తెలుగు రాష్ట్రాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ కసరత్తులను ప్రారంభించింది. అదే విధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి-మహబూబ్ నగర్-హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఈవోలకు మెయిల్ ద్వారా సమాచారాన్ని అందజేసింది.
అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 6 వ తేదీ వరకు ఈ నూతన ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక డిసెంబర్ 1వ తేదీన పట్ట భద్రుల ఓటర్ లిస్టును విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు పరిష్కరించనున్నారు. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. జనవరి 18వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టును విడుదల చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం మహబూబ్నగర్- ఉమ్మడి రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న ఎన్. రామచంద్రరావు.. ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డిల పదవీ కాలం మార్చి 29వ తేదీ 2021న ముగియనుంది.