మధ్యప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో అనేకమంది వరద నీటిలో చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూటీం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తోంది. హోషంగ్బాద్తో పాటు పలు జిల్లాలో వరద ప్రాంతాలను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని పరిస్థితుల గురించి వివరించినట్లు తెలిపారు. కేంద్రం కావాల్సిన సహాయం చేసేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఇక నర్మాదా నది కూడా పొంగిపొర్లుతుండటంతో.. అధికారులను అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆదేశించారు. మరో 48 గంటలు భారీ వర్ష సూచన ఉండటంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలావుంటే.. మాండసర్ ప్రాంతంలోని పశుపతినాథ్ ఆలయంలోకి నీరు ప్రవేశించింది. శివనా నది పొంగిపొర్లుతుండటంతో.. ఆలయ పరిసర ప్రాంతమంతా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఏకంగా ఆలయంలో సగ భాగం వరకు వరదనీరు నిండిపోయింది.