అంతర్జాతీయ వేదికగా “చాయ్‌ పే కుట్ర”.. మోదీ ఆగ్రహం

Spread the love

అసోం రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు వారి ప్రచారాలకు తెరలేపుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. అంతేకాదు.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. తాజాగా “అసోం మాల” పేరుతో అసోం రాష్ట్ర రహదారుల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. అంతేకాదు.. రెండు వైద్య కళాశాలలకు కూడా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహింరగ కార్యక్రమంలో స్థానిక తేయాకు పరిశ్రమ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులగా అంతర్జాతీయ వేదికగా భారత తేయాకు పరిశ్రమపై కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు చేస్తున్న వారిపై తేయాకు కార్మికులు తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. తేయాకు తోట సాగులో అసోం ప్రముఖ స్థానంలో ఉందన్నారు. భారత తేయాకు పరిశ్రమపై కొందరు విష ప్రచారం చేస్తున్నారని.. పరోక్షంగా “గ్రీన్‌పీస్‌” ఎన్జీవో నివేదికను ఉద్దేశిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని తేయాకు తోటల్లో ఎరువులను అధికంగా వినియోగిస్తున్నారని గ్రీన్‌పీస్‌ సంస్థ తన నివేదికలో ఆరోపించింది. ఇలాంటి దాడులను భారత తేయాకు పరిశ్రమల కార్మికులు సహించరంటూ మోదీ మండిపడ్డారు.


Spread the love
error: Content is protected !!