బర్తరఫ్‌పై స్పందించిన ఈటల రాజేందర్‌.. నీ అధికారులకు వావివరసలు లేవా..?

Spread the love

తెలంగాణ కేబినేట్‌ నుంచి తప్పించడంపై మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేదంర్‌ స్పందించారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ దగ్గర ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖను తొలగిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఊహించని విధంగా ఆదివారం నాడు మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ బర్తరఫ్‌ చేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11.00 గంటలకు ఈటల రాజేందర్‌ స్పందించారు.

సీఎం కేసీఆర్‌తో తాను 19 ఏళ్లు కలిసి పనిచేశానన్నారు. ఎప్పుడు కూడా పార్టీకి,ప్రభుత్వానికి మచ్చతెచ్చే పని చేయలేదన్నారు. కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు తనపై శక్తినంతా ఉపయోగించారని.. తనపై విజిలెన్స్‌, ఏసీబీ, రెవెన్యూ శాఖలను ప్రయోగించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు మెప్పించలేవని.. ఇవి సీఎం కేసీఆర్ స్థాయికి తగ్గ పనులు కాదని ఈటల రాజేందర్‌ అన్నారు. వందల మంది ఆఫీసర్లను పెట్టుకుని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. రాజ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసే, కాల్చివేసే అధికారం ఉంటుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఇక జమున హ్యాచరీస్‌ చైర్మన్‌ తాను కాదని.. తనకు అసలు సంబంధమే లేదని ఈటల రాజేందర్‌ అన్నారు. మీ అధికారులకు వావివరసలేదంటూ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించారు. మీరు చెబితే ఏ కలెక్టర్ అయినా మీరు చెప్పిన రిపోర్టే ఇస్తారని.. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదంటూ ఈటల రాజేందర్‌ అన్నారు.


Spread the love
error: Content is protected !!