పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన గోవా గురించి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి గోవాకి వెళ్లాలంటే మొన్నటి వరకు కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. గోవాలో మాత్రం కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా.. వారు కరోనా నెగిటివ్ రిపోర్ట్స్ను తీసుకువస్తేనే లోనికి అనుమతించేవారు. అంతేకాదు.. ఎవరైనా గోవాలోకి ఎంటర్ కావాలంటే.. ముందు క్వారంటైన్లో ఉంటూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఆ తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వస్తే లోనికి అనుమతించేవారు. ఒకవేళ పాజిటివ్ వస్తే కరోనా కేర్ సెంటర్ లేదా.. ఆస్పత్రికి తరలించేవారు. అయితే గూడ్స్ ట్రాన్స్పోర్ట్కు చెందిన డ్రైవర్లకు మాత్రం ఇందులో వెసులుబాటు ఉండేది.
అయితే అన్లాక్ 4.0 తర్వాత.. గోవాలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ఇకపై రాష్ట్రంలోకి ఎవరైనా సరే.. ఎలాంటి ఆంక్షలు లేకుండా రావొచ్చని తెలిపారు. గోవాలోకి అడుగుపెట్టేందుకు ఇకపై కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిన పనిలేదన్నారు. అయితే సోషల్ డిస్టెన్స్, మాస్క్ వంటి నిబంధనలు మాత్రం ఖచ్చితంగా వర్తిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోకి వచ్చిన వారంతా.. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న రూల్స్ పాటించాలన్నారు. ఇదిలావుంటే గోవా ఎయిర్ పోర్ట్ కూడా డొమెస్టిక్ ప్రయాణాలపై ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. ఇకపై దేశీ ప్రయాణాలు చేసే వారికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపింది.
దీంతో ప్రస్తుతం గోవా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి పర్యాటకులు పెరగనున్నారు. ఇప్పటికే బుధవారం ఉదయం నుంచే గోవాలో బార్స్ ఓపెన్ అయ్యాయి. అయితే బార్స్ లోనికి ప్రవేశించేముందు కరోనా కట్టడి తీసుకునే నిబంధనలు పాటించాలని.. మాస్క్, సోషల్ డిస్టెన్స్, శరీర ఉష్ణోగ్రత చెక్ చేయడం వంటివి తప్పనిసరి అని తెలిపింది. ఇక క్యాసినో మాత్రం ప్రస్తుతం క్లోజ్ ఉందని.. మాన్సూన్ సీజన్ తగ్గిన తర్వాత బీచ్ షక్స్ కూడా ఓపెన్ చేస్తామని అధికారులు తెలిపారు.