నేడే గోపాష్టమి.. గోమాతకు పూజచేసి.. గోమాత అనుగ్రహం పొందండి.. పూజా విధానం ఇదే..!!

Spread the love

మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో నిత్యం అనేక పండుగలు వస్తుంటాయి. అనాదిగా వస్తున్న ప్రతీ పండుగకు ఓ ప్రాధాన్యత ఉంటుంది. దీని కారణంగా సమాజంలో చైతన్యం మరియు కొత్త జీవితం ఉంటుంది. పండుగలు మనిషిలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ప్రేమను ఇస్తుంటాయి. మన దేశ హైందవ సంస్కృతిలో ఉన్న పండుగలు, పర్వదినాలు ఏదో ఒక సంఘటన, కథ, కథనంతో సమాజానికి పవిత్రమైన సందేశం ఇచ్చేలా ఉండేవే. ఈ పండుగల్లో గోపాష్టమి కూడా ఒకటి. అయితే ఈ పండుగ విశిష్టతను ప్రస్తుతం చాలామంది విస్మయించారు.

వాస్తవానికి భారతీయ సంస్కృతి అనేది.. గో సంస్కృతి యొక్క స్వరూపము. హైందవ సంస్కృతిలో జరుపుకునే పలు పండుగలలో గోవులను స్మరించుకుంటాము. గోమాతగా పూజిస్తూ.. గోవుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తాము. ఇటువంటి గోమాతలకు శ్రీ కృష్ణ పరమాత్ముడు కాపరిగా ఉన్నాడు. అయితే శ్రీకృష్ణుడు తొలిసారిగా గోవులను సంరక్షించేందుకు చెప్పులు లేకుండా వెళ్లిన కొలిచే మహాపర్వములలో గోపాష్టమి ఒకటి.

గోపాష్టమి పండుగ ఎలా వచ్చిందంటే..

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మొదటిసారిగా చెప్పులు లేకుండా గోసంరక్షణకు వెళ్ళాడు. ఆ రోజున తల్లి యశోద శ్రీకృష్ణుని చేతికి సంకల్ప దారాన్ని కట్టి, కర్రలు మరియు నల్ల కమలం సమర్పించి గోసంరక్షణ కోసం అడవికి పంపింది. ఆ రోజు నుండే శ్రీకృష్ణుడిని గోపాల్ అని పిలుస్తారు. అయితే అలా శ్రీకృష్ణుడు వెళ్లిన రోజున కార్తీక శుక్ల పక్ష అష్టమి తిథి ఉంది. అప్పటి నుంచి ఈ తిథిని గోపాష్టమి అంటారు. కార్తీక శుక్ల పక్షం పాడ్యమి నుండి సప్తమి తిథి వరకు గోవర్ధన పర్వతానికి శ్రీకృష్ణుడు మరియు గోరక్షకులు పూజ నిర్వహించారు. శ్రీకృష్ణుడు ఇంద్రుడితో చేసిన పోరాటమే ఈ కథ సారాంశం.

గోపాష్టమి పూజా విధానం..

గోపాష్టమి.. శ్రీ కృష్టుడు గోవును పూజించిన శుభదినం. దీపావళి పండుగ అనంతరం ఎనిమిదవ రోజున వస్తుంది. అంటే కార్తీక మాస శుక్ల పక్ష అష్టమి రోజున. ఈ రోజున గోవులను పూజించాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. గోపాష్టమి రోజున గోవులకు స్నానమాచరింపచేసి.. పసుపు కుంకుమలతో అలంకరించి.. కొమ్ములకు రంగుల దారాలు కట్టి.. ఆపై వాటికి అరటి పండ్లు లేదా.. ఇతర పండ్లు నైవేద్యంగా ఇవ్వాలి. అనంతరం గోవుకు కర్పూర హారతి ఇచ్చి.. గోవు చుట్టు మూడు ప్రదక్షిణలు చేయాలి. కాగా, గోవులకు గోపాష్టమి రోజున పశుగ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను పెడితే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. గోవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారని.. అందుకే గోవుకు గోమాత అనే హోదాను ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు కూడా చెబుతున్నారు.

కాగా, ప్రస్తుతం గోపాష్టమి పండుగను యావత్ హిందూ సమాజం చేయాలన్న ఆలోచనతో విశ్వ హిందూ పరిషత్ వారు ప్రతి ఏటా జరిపే ఏడు ముఖ్యమైన పర్వ దినాల్లో గోపాష్టమి 4వ పర్వదినంగా ఉంది. “ఇంటింటా ఆవు.. గ్రామ-గ్రామము గోశాల.. ఇది మన ఆరోగ్యశాల..” అన్న నినాదంతో ఈ పండుగకు వీహెచ్పీ ప్రాధాన్యత ఇస్తోంది.


Spread the love
error: Content is protected !!