దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ గ్యాంగ్రేప్ బాధితురాలి అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహన సంస్కారాలు ముగించే విధంగా పోలీసులు బలవంతం చేశారని బాధితురాలి సోదరుడు తెలిపాడు. బుధవారం తెల్లవారుజామున 4.00 గంటలకు ముందే బాధితురాలి దహన సంస్కారాలు ముగిసినట్లు ఆమె సోదరుడు చెప్పాడు. తెల్లవారిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని పోలీసులకు చెప్పినప్పటికీ.. బలవంతంగా చేసేశారని తెలిపాడు. మృతదేహాన్ని డైరక్ట్గా స్మశాన వాటికకే తరలించారన్నారు. తమకు స్థానిక పోలీసులపై నమ్మకం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ జరిపి.. నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. తమకు ప్రాణభయం ఉందని.. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలన కోరారు.
కాగా, హత్రస్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతిని ఈ నెల 14వ తేదీన నలుగురు కామాంధులు అత్యంత కిరాతకంగా గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెపై దాడి కూడా చేశారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరింది. ఈ క్రమంలో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఉరితీయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కూడా హత్రస్ ఘటనపై నిరసనలు తెల్పుతున్నారు.