పాకిస్థాన్లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా హిందూ దేవాలయాలే లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా దేవాలయాల స్థలాన్నే మింగేద్దామనుకుంటున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారిని టార్గెట్ చేస్తారు. వారి ఇంట్లో అమ్మాయిలు ఉంటే.. ఇక అంతే సంగతులు. కిడ్నాప్ చేయడం.. ఆ తర్వాత మతం మార్చి వివాహం చేసుకోవడం.. ఇలా వారు ఎంతకైనా తెగిస్తారు. ఇది మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో పరిస్థితి. పాక్ లోనే కాదు.. చాపకింద నీరులా గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్లో కూడా హిందువుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. క్రమక్రమంగా బంగ్లాదేశ్లో హిందువుల సంఖ్య తగ్గిపోతోంది. విగ్రహారాదన ఇష్టపడని స్థానికులు.. అక్కడ ఉన్న హిందూ ఆలయాలను ధ్వంసం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తూ.. అక్కడి హిందువులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోనే ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఘజీపూర్ నగరంలోని ధక్కిన్ సల్నా ప్రాంతంలోని కాళీ మందిరంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం నాడు చోటుచేసుకుంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు నరేష్ రే తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికులు కొందరు ఈ ఆలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గురువారం నాడు కూడా ఆలయ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారన్నారు. ఈ క్రమంలో స్థానిక హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించే క్రమంలో వారు వెనుదిరిగారన్నారు. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి సమయంలో ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మొత్తం ఆలయంలోని నాలుగు విగ్రహాలను ధ్వంసం చేశారని.. ఇందులో కాళీ మాతా విగ్రహం కూడా ఉందన్నారు.
ఈ విగ్రహాల ఘటనపై ఆలయ కమిటీ స్థానిక ఘజీపూర్ సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని.. ఘటనా స్థలిని ఉన్నతాధికారులు కూడా పరిశీలించారని స్థానిక పోలీసులు చెబుతున్నారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని చెబుతూ వస్తున్నారు.
అయితే ఈ ఆలయ విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించిన చిత్రాలను మానవ హక్కుల కార్యకర్త ప్రదీప్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “హిందూ ఆలయంపై దాడి, విగ్రహాల ధ్వంసం, ఘాజీపూర్, ఢాకా, బంగ్లాదేశ్”అంటూ తన ట్విట్టర్లో రాసుకువచ్చారు.
కాగా, ఘాజీపూర్లోని కాళీ మాత ఆలయ ఘటనపై స్థానిక హిందువులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనపై ఘజీపూర్కు చెందిన పూజా ఉద్జాపన్ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.