పాక్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. పాక్లో ముస్లిమేతరులు జీవించడం ఎంత కష్టమన్నది పలు వీడియోలు చూస్తుంటే అర్ధమవుతోంది. ఇమ్రాన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలుగా ఉన్న హిందువులు,క్రైస్తవులపై మరింత దాడులు పెరిగాయి. తాజాగా గత కొద్ది రోజులుగా హిందువుల పవిత్ర
పుణ్యక్షేత్రాలను, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. ప్రసిద్దిగాంచిన దేవాలయాలపై వరుస దాడులు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. అక్కడి హిందువులను భయబ్రాంతులకు గురిచేస్తూ.. మైనర్ అమ్మాయిలను అపహరించుకుపోయి.. బలవంతపు మతమార్పిడి చేసి వివాహాలు చేసుకుంటున్నారు. తాజాగా కరక్ పట్టణంలో జరిగిన విధ్వంస కాండ చూస్తే.. ఇక అక్కడ హిందువుల మనుగడ ప్రశ్నార్ధకమేనని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. పాక్లోని కరక్ పట్టణంలోని తెరిలో ఉన్న హిందూ ఆలయంపై స్థానిక ముస్లిం మూకలు దాడికి పాల్పడ్డాయి. డిసెంబర్ 30వ తేదీ బుధవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆలయాన్ని పునరుద్దరించేందుకు స్థానిక హిందూ సమాజానికి అధికారులు అనుమతులనిచ్చినప్పటికీ.. అక్కడి ఇస్లామిక్ సంస్థలు హిందువులపై దాడులకు దిగాయి. అక్కడి దేవాలయంపై మూక దాడికి దిగి.. తగలబెట్టారు. అక్కడి ఇస్లామిక్ మతపెద్దలతో పాటు.. జమైతే ఉలేమా ఇస్లామ్ పార్టీ కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ.. అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. పాక్ మత వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్ హక్ ఖాద్రీ ఖండించారు. అనంతరం ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు. అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మైనార్టీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడి అనంతరం అక్కడ ప్రస్తుత పరిస్థితిని ఓ వ్యక్తి వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను చూస్తే పాక్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోంది.
Video taken From “Rahat Austin” Twitter Account