దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య ఘటన కేసులో.. దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఒకేసారి ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో తలారి పవన్ ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో.. ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే తొలిసారి. అయితే శిక్షను తప్పించుకునేందుకు దోషులు చివరి వరకు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. ఇక దోషులకు ఎటువంటి చట్టపరమైన అవకాశాలు లేవని ఢిల్లీ కోర్టు గురువారం నాడు స్పష్టం చేసింది. దీంతో ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. అయితే గురువారం అర్దరాత్రి కూడా దోషుల తరఫున లాయర్ కోర్టు తలపులను తట్టాడు. కానీ ఫలితం లేకపోయింది. 5.30 నిమిషాలకు తీహార్ జైలులో నలుగురు దోషులను ఉరి తీశారు. అనంతరం 14 నిమిషాల తర్వాత దోషుల శరీర కదలికలు ఆగిపోయాయి. ఆ తర్వాత 30 నిమిషాలకు వారు మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రవీకరించారు. దీంతో.. ఏడేళ్ల నిర్భయ తల్లి ఆశాదేవి నిరీక్షణకు తెర పడింది. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏడేళ్లపాటు పోరాటం చేశానని.. ఆలస్యమైనా చివరకు న్యాయం గెలిచిందన్నారు. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిదిద్దాలని..
నిర్భయ ఫొటోను పట్టుకుని నీకు ఇవాళ న్యాయం జరిగిందని ఏడ్చానని తెలిపారు. ఇలాంటి కేసుల్లో తక్షణమే న్యాయం జరగాలని పోరాటం చేస్తానని.. మన సమీపంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబాలకు తోడుగా నిలవాలని కోరారు.