రష్యాకు ఊహించని ఝలక్ ఇచ్చింది భారత్. వచ్చే సెప్టెంబర్ మాసంలో రష్యా నిర్వహించబోతున్న సైనిక విన్యాసాల్లో పాల్గొనవద్దని భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యూహాత్మక విన్యాసాల కార్యక్రమాల్లో పాక్,చైనా కూడా పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సౌత్ రష్యాలోని అస్టాఖాన్ ప్రావిన్స్లో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సైనిక విన్యాసాలు జరగనున్నాయి. అయితే ఈ విన్యాసాల్లో తాము కూడా పాల్గొంటామని భారత్ గతవారం పేర్కొంది. ఈ విషయాన్ని రష్యాకు కూడా తెలిపింది. అయితే ఈ కార్యక్రమాల్లో పాక్, చైనా కూడా పాల్గొంటున్నాయన్న విషయం తెలియడంతో భారత ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. పాక్,చైనాలు పాల్గొంటున్న ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రష్యాకు కూడా తెలిపింది.
అయితే గత జూన్లో గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో నేపథ్యంలో చైనా, భారత్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు పాక్ నిత్యం తన వక్రబుద్దిని ప్రదర్శిస్తూ.. దేశంలోకి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను చొప్పించే ప్రయత్నం చేస్తూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరుపుతోంది. ఈ క్రమంలో పాక్, డ్రాగన్ కంట్రీలు పాల్గొంటున్న ఈ సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొనబోదని రష్యాకు పరోక్షంగా తెలిపింది. అయితే భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని రష్యా ఊహించకుండా పోయిందని తెలుస్తోంది.