ఆర్మీ.. వీరిని చూస్తే శత్రువులు భయంతో వణికిపోవాల్సిందే. ఎందుకంటే ఏ దేశానికి చెందిన ఆర్మీ అయినా సరే.. వారి దేశాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఇతరులెవరైనా సరిహద్దు దాటితే వెంటనే దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత వారిని లొంగదీసుకుని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విచారణ చేపట్టడం అనేది జరుగుతుంటుంది. అయితే మన భారత ఆర్మీ మాత్రం మానవత్వానికే తొలి ప్రాముఖ్యత అంటూ గర్వంగా చెబుతోంది.
తాజాగా నార్త్ సిక్కింలో జరిగిన ఓ సంఘటన మన భారత ఆర్మీ మానవత్వాన్ని చాటుతోంది. నార్త్ సిక్కిం పీఠభూమి ప్రాంతంలో డ్రాగన్ కంట్రీ (చైనా)కు చెందిన ముగ్గురు పౌరులు దారితప్పారు. ఈ నార్త్ సిక్కం ప్రాంతంలోని భారత్-చైనా సరిహద్దు ప్రాంత సమీపంలో ఏకంగా 17,500 అడుగుల ఎత్తున గురువారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే వీరికి దారి అర్ధంకాక పోవడంతో పాటు తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కొన్నారు. వీరిని గమనించిన భారత ఆర్మీ.. వెంటనే వారిని రక్షించింది. 17వేల ఎత్తులో ఉండటంతో వారికి ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి ఆక్సిజన్ అందించి ఆహారాన్ని ఇచ్చారు. అనంతరం వారు అక్కడిని చలిని తట్టుకునేలా పలు దుస్తులు కూడా అందజేశారు.అంతేకాదు.. ఆ చైనా పౌరులు ముగ్గురు సురక్షితంగా వారి గమ్యాన్ని చేరుకునేందుకు రూట్ మ్యాప్ కూడా తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను భారత ఆర్మీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.