గత జూన్ నెలలో గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న సంఘటన తర్వాత.. భారత్, చైనా దేశాల మధ్య టంగ్ వార్ పీక్ స్టేజ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 15వ తేదీన గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 21 మంది భారత సైనికులు వీరమరణం పొందగా.. దాదాపు నలభై మందికి పైగా డ్రాగన్ కంట్రీకి చెందిన సైనికులు హతమయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది. అయితే ఇరు దేశాలకు చెందిన అధికారులు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సఫలమవ్వడం లేదు.
తాజాగా.. భారత సైన్యమే సరిహద్దు దాటుతూ అలజడి సృష్టిస్తోందని చైనా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లోని చైనా ఎంబసీ స్పందించింది. లదాఖ్ సరిహద్దులోని పాన్గాంగ్ సో వద్ద ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి నుంచి నెలకొన్న ఘర్షణ వాతావరణంపై ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. పాన్గంగ్ సో సదరన్ ప్రాంతంలో భారత సైన్యం సరిహద్దు దాటుతూ ఉల్లంఘనలకు పాల్పడుతోందని చైనా ఎంబసీ ఆరోపించింది. దీనికి సంబంధించిన విషయంపై భారత్తో చర్చలు కూడా జరిపామని.. ఫ్రంట్లైన్ దళాలను నియంత్రణలో ఉంచాలని కోరినట్లు ఎంబసీ కాన్సులర్ జో రాంగ్ తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని భారత సైన్యం ఉల్లంఘిస్తోందని.. దీంతో మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందంటూ ఎంబసీ ఆందోళన చెందుతోంది.