దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తామ పార్టీనే ఇక అంటూ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పంజాబ్లో ఆప్ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఫలితాలు వచ్చి వారం రోజులు కూడా గడవకముందే అక్కడ దారుణ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జలంధర్లోని మాలియన్ గ్రామంలో అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ సందీప్ సింగ్ నంగల్ దారుణ హత్యకు గురయ్యాడు.

గ్రామంలో స్థానికంగా కబడ్డీ టోర్నీమెంట్ జరుగుతుండగా సందీప్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని జలంధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లఖ్వీందర్ సింగ్ ధృవీకరించారు. అయితే స్థానికంగా ఏమైనా గొడవలు ఉన్నాయా..? లేదా ఎవరైనా కుట్ర పూరితంగా హతమార్చారా అన్నదానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు సదరు అధికారి తెలిపారు.
కాగా, పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం ఏర్పడగానే.. ఈ దారుణ ఘటన జరగడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరికొందరైతే ఆప్ హయాంలో శాంత్రి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశ ముందంటూ కామెంట్లు పెడుతున్నారు.