అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ రథం దగ్ధంపై జనసేనా చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. మొన్న పిఠాపురం.. కొండబిట్రగుంట.. ఇప్పుడు అంతర్వేది సంఘటనలు.. ఇవన్నీ యాధృచ్చికాలు కావని ఆరోపించారు. అసలు ఎన్ని విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనాలు యాధృచ్చికంగా జరుగుతాయని ప్రశ్నించారు. మతిస్థిమితం లేనివారి పని.. తేనె పట్టుకోసం చేసిన పని అంటుంటే పిల్లలు కూడా నవ్వుతున్నారన్నారు.
పిఠాపూరంలో విగ్రహాల ధ్వంసం సమయంలోనే ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యేవా అంటూ ప్రశ్నించారు. విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతలిస్తూ తమ నిరసన తెలపాలని కోరారు. ఇతర మతాలకు చెందిన పెద్దలు కూడా ఈ సంఘటనలను ఖండించాలని.. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని.. హైకోర్టు రిటైర్డ్ జడ్జ్తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే.. సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని జనసేనాని అన్నారు. ఒకవేళ ఉగ్రవాద కోణం ఉంటే.. జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇక హిందూ పుణ్యక్షేత్రాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించాలని కోరారు.