తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ సర్కార్ సువర్ణవకాశాన్ని కల్పిస్తోంది. పట్టణ ప్రాంతాలతో పాటు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న అనధికారికి ప్లాట్లు, లే అవుట్స్ క్రమబద్దీకరణ (రెగ్యులరైజ్)కు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
కేసీఆర్ సర్కార్ కల్పిస్తున్న ఈ లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం ప్రజలకు గొప్ప వరమంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలియకుండా ఎంతో మంది ప్రజలు పలు అనధికారిక లే అవుట్స్లో ప్లాట్లను కొనగోలు చేశారని.. వారంతా ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమవారం నాడు నగరంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఆన్లైన్, మీ సేవ సర్వీసు, అవగాహన పోస్టర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఇదే మంచి అవకాశమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందన్నారు.
అనధికారికంగా ఉన్న ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దీకరించుకోకపోతే.. వారు అన్ని హక్కులు కోల్పోతారని.. వారికి భవన నిర్మాణాల అనుమతి లభించదని.. అంతేకాకుండా రిజిస్ట్రేషన్, విద్యుత్ కనెక్షన్, మంచి నీటి కనెక్షన్ లభించదని తెలిపారు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకుని రెగ్యులరైజ్ చేసుకుంటే.. అన్ని హక్కులు పొందడంతో పాటుగా.. ప్రభుత్వం కల్పించే అన్ని మౌలిక సదుపాయాలు కూడా పొందుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్టోబర్ 15వ తేదీలోగా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని.. ఇలా క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న వారు దీని ఫీజును వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ లోగపుగా చెల్లించాలన్నారు.
అయితే గవర్నమెంట్ ల్యాండ్స్ (ప్రభుత్వ స్థలాలు), అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములు, దేవాదాయ శాఖకు చెందిన భూములు, చెరువులకు చెందిన శిఖం భూముల్లోని ప్లాట్లకు.. ఈ ఎల్ఆర్ఎస్ పథకం వర్తించదు.ఈ పథకానికి చెందిన మరిన్ని వివరాల కోసం http://lrs.telangana.gov.in లేదా దగ్గర లోని మీసేవ కేంద్రాన్ని సంప్రదించండి.