విశ్వమానవహిత.. భగవద్గీత.. (లక్ష యువగళ గీతార్చన..ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలతో..)

Spread the love

లక్ష యువగళ గీతార్చన.. లక్ష మంది యువతచే గీతా పారాయణం

వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనమ్ |

దేవకీపరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||

Laksha Yuva Gala Gitarchana
Laksha Yuva Gala Gitarchana special story

శ్రీకృష్ణుడు జగద్గురువు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ఈ జగత్తులోని ప్రతీ మానవుడిని ఉద్దేశించి చేసిన మహెూదాత్త ఉపదేశం. జగత్తులో ఉన్న ప్రతి మానవునికి అభ్యుదయాన్ని, (ఇహ, పరలోకాలలో సౌఖ్యం) శ్రేయస్సునూ సమకూర్చే అద్భుత మార్గం. ఇది భారతదేశానికి మాత్రమే కాక విశ్వమంతటా దేశ, కాల, జాతి భేదాలకు అతీతంగా సకల జనావళికి మార్గదర్శనం చేసే ఉత్తమ గ్రంథం. అందుచేత ఇది విశ్వజనీనం. ఇటువంటి మహత్తరమైన ఉపదేశం చేసిన గురువు శ్రీకృష్ణుడు జగద్గురువు. ఇందులో ఎట్టి సందేహమూ లేదు.

భగవద్గీత అనేక విషయాలను గూర్చి విపులంగా చెప్పింది. వీటి అన్నింటిలోను ప్రధానమైన విషయం ఆత్మస్వరూప నిరూపణం. ఆత్మ అంటే అఖండమైన చైతన్యం. ఇది అంతటా వ్యాపించి ఉన్న పరమార్ధసత్యం. దీనికే ‘బ్రహ్మ’ అని పేరు. దేనికంటే పెద్దది మరొకటి లేదో, ఏది చతుర్దశ భువనాలలోను వ్యాపించి అన్నింటినీ తనలో ఇముడ్చుకొన్నదో, వాటిని మించి కూడ ఉన్నదో అదే ‘బ్రహ్మ’ అని శాస్త్రజ్ఞులు చెప్పే సమగ్ర అర్థం. ‘ఆత్మన్’ శబ్దానికి కూడా ఇదే అర్థం.

యచ్ఛాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ |

యచ్చాస్య సంతతో భావః తస్మాదాత్మేతి కథ్యతే ||

ఇది అంతటా వ్యాపించి ఉంది. అన్నింటినీ గ్రహిస్తుంది. విషయాలను (భోగ్యవస్తువులను) స్వీకరిస్తుంది. ఇది నిరంతరంగా, అనగా ఎల్లప్పుడూ అన్ని చోట్లా ఉంటుంది. అందుచేత దీనికి ‘ఆత్మ’ అని పేరు. భగవద్గీతోపదేశం రెండవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది. మొదటి అధ్యాయమూ, ద్వితీయాధ్యాయంలోని మొదటి పది శ్లోకాలూ కూడ అర్జున విషాదాన్ని (అర్జునుని మనస్సులో కలిగిన దుఃఖం) వర్ణించే ఘట్టం. ఆత్మత్వ నిరూపణం ద్వితీయాధ్యాయంలో ఇక్కడి నుండి ప్రారంభం అయి చివరివరకూ కొనసాగుతుంది. ‘ఆత్మన్’ అనేది ఏదో, ఎక్కడో దూరంగా ఉన్న వస్తువు కాదు, అంతటా ఉంది. అంతటా ఉన్న ఆత్మయే ఆయా శరీరాలకు సంబంధించినంతవరకు ‘జీవాత్మ’ అని చెప్పబడుతుంది.

Laksha Yuva Gala Gitarchana gaganam
Laksha Yuva Gala Gitarchana

‘నేను’, ‘నేను’ అని ప్రతి ఒక్కడూ అనుకొనే, దేహేంద్రి యాదులకంటె వేరుగా ఉన్న ఆ ‘తాను’ అనుకొనేదే ఆత్మ’. తనను తెలిసికొంటే ‘ఆత్మ’ అంటే ఏమిటో, అది సకల భేదాలకీ అతీతమైన ఎలాంటి తత్త్వమో తెలిసికొన్నట్లే. ఈ ‘తాను’, ‘నేను’, ‘ఆత్మ’ చతుర్ముఖ బ్రహ్మ మొదలు కంటికి కనబడని అతి క్షుద్రప్రాణి వరకు అన్నింటికి సంబంధిం చినది. వాటికన్నింటికీ ఏకత్వాన్ని సమకూర్చే తత్త్వం. దేశకాలాది భేదాలకు అతీతంగా ఉన్న ఈ ఆత్మతత్వాన్ని ఉపదేశించిన గురువు ‘జగద్గురువు అనీ, ఆ గ్రంథం ‘జగత్ గ్రంథం’ (యూనివర్సల్ బుక్) అనీ అనడానికి ఇదే ప్రధాన కారణం. విషాదం చెంది, ‘యుద్ధం చేయను’ అంటూ నేలపై చతికిలబడిన అర్జునునికి, అతడు యుద్ధం చేయడానికి తగిన ప్రోత్సాహం ఇస్తూ ధైర్యం చెప్పడానికి బదులు శ్రీకృష్ణుడు ఆతనికి ఈ ఆత్మతత్త్వోపదేశం ఎందుకు చేసినట్లు అనే ప్రశ్న కలుగుతుంది. ఆ ఘట్టాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. అర్జునుడు ధీశాలి, మహావీరుడు, భయం అంటే తెలియనివాడు. దేవతలు కూడ సంహరింపజాలని నివాతకవచాది రాక్షసులను అనాయాసంగా సంహరించినవాడు. శాస్త్రాల నుండీ, పెద్దల నుండి ధర్మాధర్మాలస్వరూపం చక్కగా గ్రహించినవాడు. అలాంటి వాడు కూడా శోకమోహాలకు వశుడైపోయాడు. ఇవి పిరికితనం వల్ల కలిగినవి కావు.అర్జునునికి కలిగిన ఈ విషాదం గోగ్రహణంలాంటి విషాదమే అయితే దానిని తొలగించడానికి శ్రీకృష్ణుని ఉపదేశం మరోలా ఉండేది.

Laksha Yuva Gala Gitarchana
Laksha Yuva Gala Gitarchana special story

అర్జునుని విషాదానికి కారణాలు వేరు. ‘యుద్ధంలో తన వాళ్లందరూ మరణిస్తారు’ అనేది మొదటి కారణం. ‘తాను స్వయంగా తన వాళ్లందరినీ చంపడం అధర్మం’ అనే భావన రెండవ కారణం. ఈ విషాద కారణాలను రెండింటినీ తొలగించి అర్జునుని స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరించ డానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నం అంతా. తన వాళ్లం దరూ నశిస్తారనే అర్జునుని అభిప్రాయం తొలగించడం కోసం అతడు ‘శరీరాలు ఏ నాటికైనా నశించేవే, అవి నశించినా ఆత్మ నశించదు’ అనే ఆత్మతత్త్వాన్ని ప్రతిపాదించే సాంఖ్య యోగం (జ్ఞానయోగం) బోధించాడు. అలాగే తాను చేస్తున్న పని అధర్మం, పాపహేతువు అనే ఆతని భ్రాంతిని తొలగించడం కోసం ప్రతి ఒక్కడూ తన కర్తవ్యమైన కర్మను తప్పకుండా చెయ్యాలి, అలా చేయక పోవడం అధర్మం అవుతుంది’ అని చెపుతూ ఆ కర్మను ఎలా చేస్తే కర్తకు పాపపుణ్యాలు అంటవో అలాంటి విధానాన్ని (కర్మ యోగాన్ని) బోధించాడు. భగవద్గీతలోని ప్రధాన విషయాలు ఈ రెండే. కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు నడిపించడం గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చు. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.

Laksha Yuva Gala Gitarchana
Laksha Yuva Gala Gitarchana special story

ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరు చేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే, అంటే తన గురించి, తనలోని అంతరాత్మ గురించి తెలుసు కోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోతృష్టమైన పరబ్రహ్మాన్ని చేర గలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మల వలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి. భగవద్గీత రూపంలో మానవునికి మోక్షం ప్రసాదించే మార్గం ప్రబోధించిన శ్రీకృష్ణుడే పరబ్రహ్మం. సృష్టిలోని సకలం ఆయన అంశతోనే ఉన్నాయి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీ కృష్ణుని విశ్వ రూపాన్ని అర్జునుడు చూసి తరించాడు.

ప్రకృతిలో సకల జీవాలు సత్వ రజ స్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధం నుండి విముక్తి లభిస్తుంది.

Laksha Yuva Gala Gitarchana special story
Laksha Yuva Gala Gitarchana special story

భగవద్గీత మండల జ్ఞాన యజ్ఞం (లక్ష యువ గళ గీతార్చన) భారతీయ యువత (15 నుండి 40 సంవత్సరముల వయస్కులు) లోని ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని, క్రియాశక్తిని మేలుకొల్పి ఆత్మసైర్యం

గల ధీమంతులుగా తీర్చిదిద్దటానికి భగవద్గీతలో ఎంపిక చేసిన, అత్యంత భావస్ఫోరకమైన మండల (40) శ్లోకాలను లక్ష మంది యువతచే పారాయణ చేయించాలని మహాత్ములు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ‘లక్ష యువగళ గీతార్చన’ అని నామకరణం చేశారు.

కార్యక్రమములో పాల్గొనే యువత పారాయణ చేయవలసిన మండల శ్లోకాలను ముందుగా అధ్యయనం చేసి, భావ స్ఫూర్తిని పొంది, భావార్థాన్ని హృదయస్థం చేసుకుంటే కంఠస్థం చేయటం సులభమౌతుంది. ఈ శ్లోకాల కంఠస్థంతో లభించిన చైతన్య స్ఫూర్తి ఆజన్మాంతం వెన్నంటి ఉండి ధైర్యవంతులుగా వివిధ రంగాలలో అభివృద్ధి పథంలో పయనించటానికి ఉపకరిస్తుంది.

ఈ మండల శ్లోకాలు ఎవరికి వారు స్వయంగా అధ్యయనం చేయటానికి అనుకూలంగా ‘పంచాధ్యయన పద్ధతి’ (భావచిత్రము, పదవిభాగము, ప్రతి పదార్ధం, తాత్పర్యం, విశేషార్ధం)తో కూడిన పాఠ్యప్రతులను రూపొందించారు.

 

ఈ పాఠ్య ప్రతులు “లక్ష యువగళ గీతార్చన” కార్యక్రమంలో పాల్గొనే వారందరికి విశ్వహిందూ పరిషత్ ద్వారా ఉచితంగా అందుతాయి. సకాలంలో పాఠ్య ప్రతులు అందనివారు అంతర్జాలంలో https://gitarchana.com/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిని నింపే ఇటువంటి భవ్య కార్యక్రమంలో యువత అసంఖ్యాకంగా పాల్గొనాలి, మండల శ్లోక పారాయణం చేయాలి, తమ భవితను భవ్యంగా తీర్చిదిద్దుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

 

లక్ష యువ గళ గీతార్చన – ఎప్పుడు, ఎక్కడ?

లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమం ఈ సంవత్సరం (2021) డిశంబర్ 14వ తేదీ గీతా జయంతి రోజున లక్ష మంది యువతతో సికింద్రాబాద్ లోని ‘పరేడ్ గ్రౌండ్స్’ లో భవ్యంగా జరగబోతోంది.

 

ఈ కార్య క్రమంలో పారాయణం చేయాల్సిన నలభై శ్లోకాలను విశ్వహిందూ పరిషత్ వారు ఒక బ్రోచర్ లో అందిం చారు. ఆ బ్రోచర్‌ను https://gitarchana.com/ వెబ్ సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వెబ్ సైట్లో లభిస్తాయి.

ముడుపు యాదిరెడ్డి

తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రి

విశ్వ హిందూ పరిషత్


Spread the love
error: Content is protected !!