దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండగానే.. కేంద్ర ప్రభుత్వం ఒక్కో దశలో అన్లాక్ ప్రక్రియను కొనసాగిస్తోంది. తాజాగా శనివారం సాయంత్రం అన్లాక్ 4.0 గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ గైడ్లైన్స్ అమల్లో ఉంటాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 4.0లో మరిన్ని కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా దశల వారీగా మెట్రో రైల్స్కు అనుమతిచ్చింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి దశల వారీగా మెట్రో రైల్లు పరుగులు పెట్టనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం సెప్టెంబర్ 30వ తేదీ వరకు లాక్డౌన్ నిబంధనలు అమల్లోనే ఉంటాయని పేర్కొంది.
ఇక సెప్టెంబర్ 30వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా కేంద్రాలు, మాల్స్ మూసే ఉంటాయని.. అయితే ఆన్లైన్/ డిస్టెన్స్ లెర్నింగ్ తరగతులను ప్రోత్సహించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు కూడా పర్మిషన్ ఇచ్చింది. 21వ తేదీ నుంచి స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు కూడా అనుమతిచ్చింది. అయితే ఈ కార్యక్రమాలకు 100 మందికి మించకూడదని షరతులు విధించింది.
ఇక ఈ సారి 4.0లో కూడా.. సినిమా థియేటర్స్ (ఓపెన్ ఎయిర్ థియేటర్స్ మినహా), స్విమ్మింగ్ పూల్స్,పార్కులకు అనుమతులు లేవు. ఇక అంతరాష్ట్ర రవాణాకు అనుమతులనిస్తూ.. అదే సమయంలో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రయాణాలకు పర్మిషన్ మాత్రం ఇవ్వలేదు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ ఆంక్షలు విధిస్తూ.. నిత్యవసర కార్యకలాపాలకు ఎప్పటిలాగే అనుమతులిచ్చారు.