కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారినపడుతూ.. సామాన్య ప్రజల నుంచి మొదలు రాజకీయ నేతల వరకు అంతా మరణిస్తున్నారు. తాజాగా కేంద్ర సహాయ మంత్రి కరోనా బారినపడి మరణించారు. రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న సురేష్ అంగడి ఇటీవల కరోనా బారినపడ్డారు. దాదాపు పన్నెండు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అయితే బుధవారం నాడు చికిత్స పొందుతూ మరణించారు.
సురేష్ అంగడి మరణంతో బీజేపీ శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీ నేతలు విషాదంలో మునిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ సురేష్ అంగడి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఇతర మంత్రులు.. పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు సురేష్ అంగడి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతిని తెలిపారు.